దిల్లీ పేలుడు: సీసీటీవీ ఫుటేజీలో అనుమానితులు

దేశ రాజధాని దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...........

Updated : 30 Jan 2021 11:39 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌ చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితుల ఊహాచిత్రాలను గీయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పేలుడులో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకు సన్నాహకంగానే ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు సమాచారం. ఆ ఫుటేజీని పరిశీలించగా.. టైమ్‌ స్టాంప్‌ 1970గా ఉండడం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, అందులో రికార్డయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేవని సమాచారం. అలాగే మరికొంత దూరంలో సగం కాలిన గులాబి రంగు చున్నీ, ఓ ఎన్వలప్‌ను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎన్వలప్‌లో ఇజ్రాయెల్‌ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మరణించిన ఇరాన్‌ అగ్రశ్రేణి కమాండర్‌ ఖాసీం సులేమానీ, అణు శాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పేలుడుకు ఇరాన్‌కు సంబంధం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ‘‘ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే’’ అని కూడా లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం.

ఈ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబయిలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు, ఏరోస్పేస్‌ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు.

ఇవీ చదవండి...

దేశ రాజధానిలో బాంబు పేలుడు

పెళ్లింట్లో మృత్యుఘోష


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని