Atiq Ahmed: కిడ్నాప్‌ కేసులో అతీక్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు

2006 నాటి ఉమేశ్‌ పాల్‌ కిడ్నాప్‌ కేసులో మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌తోపాటు మరో ఇద్దరిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. అంతకుముందు యూపీ పోలీసుల నుంచి రక్షణ కోరుతూ అతీక్‌ అహ్మద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

Updated : 28 Mar 2023 19:50 IST

లఖ్‌నవూ: ఉమేశ్‌ పాల్ కిడ్నాప్‌ కేసు (Umesh Pal Kidnap Case)లో మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్ (Atiq Ahmed)తోపాటు మరో ఇద్దరిని యూపీ ప్రయాగ్‌రాజ్‌ కోర్టు (Prayagraj Court) దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. అంతకుముందు.. నైనీ కేంద్ర కారాగారం నుంచి భారీ భద్రత మధ్య నిందితులను కోర్టుకు తీసుకొచ్చారు. మరోవైపు.. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ అతిక్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టేసింది.

కేసు పూర్వాపరాలు..

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే, రాజు పాల్‌ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు. 2007లో అతడు అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే అతడు హత్యకు గురయ్యాడు. అయితే, ఉమేశ్‌ను హత్య చేసినట్లు భావిస్తోన్న ఓ వ్యక్తి మార్చి 14న జరిగిన పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ కేసులో అతీక్‌ అహ్మద్‌పైనా కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా 2006 నాటి కిడ్నాప్‌ కేసులో కోర్టు.. అతీక్‌ అహ్మద్‌తోపాటు సౌలత్‌ హనీఫ్‌, దినేష్‌ పాసీలను దోషులుగా తేల్చింది.

సుప్రీం కోర్టులో చుక్కెదురు..

ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న అతీక్‌ అహ్మద్‌.. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బెలా ఎం. త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని