Droupadi Murmu: ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

పార్లమెంట్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్లలో దేశం ఆత్మనిర్భర్‌ భారత్‌గా ఆవిర్భవించేలా కేంద్రం దృక్పథాన్ని ప్రజలకు తెలియజేశారు.

Updated : 31 Jan 2023 13:10 IST

దిల్లీ: భారత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి.

దేశం ఆత్మనిర్భర్‌ భారత్‌గా ఆవిర్భవిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము కొనియాడారు. ప్రపంచానికి పరిష్కారం చూపేలా మన దేశం తయారైందన్నారు. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం.. పెద్ద కలలను సాకారం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఇప్పుడు దేశానికి అవినీతి అదిపెద్ద శత్రువు అని.. దాని నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశ ప్రజల అభివృద్ధి, రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయంగా వ్యవహరిస్తోందని, ఆర్టికల్‌ 370 రద్దు, త్రిపుల్‌ తలాక్‌ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..

75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తిచేసుకున్నాం. కొన్ని నెలల క్రితమే అమృత్‌ మహోత్సవాలు నిర్వహించుకున్నాం. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. 2047 నాటికి దేశాన్ని ఆత్మనిర్భర్‌ భారతంగా తీర్చిదిద్దాలి.

పేదరికం లేని భారత నిర్మాణం కోసం కృషి జరుగుతోంది. పేదలు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

భారత్‌ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగింది. విధాన లోపాన్ని వీడి దేశం ముందడుగు వేస్తోంది. రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలి.

అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతోంది. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నాం. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచాం. బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నాం.

ప్రపంచమంతా భారత్‌వైపు ఆశావహ దృక్పథంతో చూస్తోంది. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడుతున్నాం. మాది ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వం.

ప్రభుత్వం నిర్భయంగా పనిచేస్తోంది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా సరిహద్దులను దాటి ముష్కర మూకలను మట్టుబెట్టాం. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, త్రిపుల్‌ తలాక్‌ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నాం.

డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ ముందుకెళ్తోంది. నూతన సాంకేతిక ఆధారంగా పౌరులకు సేవలందుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం. భారత డిజిటల్ నెట్‌వర్క్‌ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారింది.

ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చాం. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. 
అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. మూడు కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించాం. నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది.

☞ తొలిసారి దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం. అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా చర్యలు తీసుకుంటున్నాం. సైన్యంలో మహిళలకు అవకాశాలు కల్పించాం. మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. బేటీ బచావో - బేటీ పఢావో విజయవంతమైంది.

చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నాం. ఫసల్‌ బీమా యోజన, కిసాన్‌ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చాం. పంట నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నాం. కనీస మద్దతు ధరను పెంచి రైతులను బలోపేతం చేస్తున్నాం.

ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధిపై దృష్టిపెట్టాం. ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టాం.

అండమాన్‌ దీవులకు పరమ్‌వీర్‌ చక్ర పురస్కారాల గ్రహీతల పేర్లు పెట్టాం.

ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్యక్రమాలతో మన రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయి. నేడు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ లాంటి స్వదేశీ విమాన వాహకనౌక మన నావికాదళంలో చేరింది.

ఓవైపు యాత్ర స్థలాలు, చారిత్రక వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతూనే.. మరోవైపు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాం. ప్రపంచంలోనే అంతరిక్ష శక్తిగా ఎదిగేందుకు భారత్‌ అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రైవేటు ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించాం.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ఇప్పుడు ప్రపంచం అర్థం చేసుకుంటోంది. అందుకే ఉగ్రవాద అంశంలో మన సూచనలను ప్రపంచదేశాలు కీలకంగా పరిగణిస్తున్నాయి.

ఈ రోజు జీ20 సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహిస్తోంది. జీ20 సభ్య దేశాలతో కలిసి ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది.

పురాతన కాలం నుంచీ ఉన్న యోగా, ఆయుర్వేద జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచ ఔషధ కేంద్రంగా మారుతున్నాం.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ రైల్వే నెట్‌వర్క్‌గా భారత రైల్వే వేగంగా దూసుకెళ్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని