మయన్మార్‌లో నిరసన ప్రదర్శనలపై ఉక్కుపాదం

మయన్మార్‌లో నిరసన ప్రదర్శనలపై పోలీసుల అణచివేత ధోరణి కొనసాగుతోంది. రాజధాని నేపిడా సహా పలు నగరాల్లో నిరసనకారులపై మంగళవారం వారు ఉక్కుపాదం మోపారు. జల ఫిరంగులు..

Published : 10 Feb 2021 22:58 IST

జల ఫిరంగులు, రబ్బరు తూటాలు ప్రయోగించిన పోలీసులు 

యంగోన్‌: మయన్మార్‌లో నిరసన ప్రదర్శనలపై పోలీసుల అణచివేత ధోరణి కొనసాగుతోంది. రాజధాని నేపిడా సహా పలు నగరాల్లో నిరసనకారులపై మంగళవారం వారు ఉక్కుపాదం మోపారు. జల ఫిరంగులు ప్రయోగించారు. రబ్బరు తూటాలతో కాల్పులు జరిపారు. పౌర ప్రభుత్వానికి తిరిగి అధికారం అప్పజెప్పాలని, అగ్ర నేత ఆంగ్‌ సాన్‌ సూకీ సహా ఇతర నేతలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నేపిడా, మాండలే తదితర నగరాల్లో పలువురు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే- నిరసనలు, బహిరంగ సభలపై తాము విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించారంటూ పోలీసులు వారిపై పలుచోట్ల జల ఫిరంగులు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. నేపిడాలో రబ్బరు తూటాలతో కాల్పులు జరపగా పలువురు గాయపడ్డారు. అదే నగరంలో రెండు డజన్ల మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 

పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి: అమెరికా 

మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని అమెరికా డిమాండ్‌ చేసింది. సైనిక తిరుగుబాటుతో అక్కడ నెలకొన్న ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపింది. నిరసనలు, బహిరంగ సభలపై సైనిక ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

ఎన్నికలు నిర్వహించి అధికారం అప్పగిస్తాం: లయాంగ్‌ 

మయన్మార్‌లో ఎన్నికలు నిర్వహించి, విజేతలకు అధికారం అప్పజెబుతామని సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ అన్నారు. పౌర ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం ఆయన తొలిసారిగా మీడియాతో మంగళవారం మాట్లాడారు. గత ఎన్నికల్లో మోసాలు చోటుచేసుకోవడం వల్లే దేశాన్ని సైన్యం తమ అధీనంలోకి తీసుకుందని చెప్పారు. 

ఇవీ చదవండి..
ఆ పరికరంపైనే ‘అణు’మానాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని