Amritpal Singh: పంజాబ్‌లో హైఅలర్ట్‌.. అమృత్‌పాల్‌ కోసం ముమ్మర గాలింపు

అమృత్‌పాల్‌ నిన్న చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో కచ్చితమైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు. అన్ని ప్రదేశాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

Updated : 19 Mar 2023 13:51 IST

చండీగఢ్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీలో ఉన్నట్లు పంజాబ్‌ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అతణ్ని పట్టుకునేందుకు భారీ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు. అమృత్‌పాల్‌ను అరెస్ట్‌ చేసే వరకు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం పంజాబ్‌ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రహదారులపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు.

అమృత్‌పాల్‌ నిన్న చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తన అనుచరులతో కలిసి అమృత్‌ పాల్‌ మోటార్‌ సైకిల్‌పై పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో కచ్చితమైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు. అయితే, అనుమానం ఉన్న అన్ని ప్రదేశాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు అమృత్‌ పాల్‌ అనుచరుల్లో 78 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అతని ఆర్థిక వ్యవహారాలను చూసుకునే దల్జీత్‌ సింగ్‌ కూడా ఉన్నాడు. అతణ్ని పోలీసులు హరియాణాలోని గురుగావ్‌లో అరెస్టు చేశారు. అలాగే అమృత్‌పాల్‌కు అంగరక్షకులుగా ఉన్న మరో ఏడుగురిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం యావత్‌ పంజాబ్‌ పోలీసు పహారాలో ఉంది. ప్రజలు సంయమనం పాటించాలని.. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగింది. సిక్కుల పవిత్ర గ్రంధాన్ని అడ్డంపెట్టుకొని అమృత్‌పాల్‌,  నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారిలేక లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. శనివారం జలంధర్‌లోని షాకోట్‌కు అతడు వస్తున్నట్లు సమాచారం అందింది. ప్రణాళిక ప్రకారం అమృత్‌పాల్‌, అతడి అనుచరులను అరెస్ట్‌ చేసేందుకు జలంధర్‌, మొగా పోలీసుల బృందం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టింది. అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలియగానే అమృత్‌పాల్‌ పారిపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని