Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్‌పాల్‌ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకుపోయిన వ్యవహారంలో పంజాబ్‌ ప్రభుత్వం పట్ల.. పంజాబ్‌- హరియాణా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసు సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

Updated : 21 Mar 2023 15:51 IST

చండీగఢ్‌: ‘‘మీ వద్ద 80 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు? అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) ఎలా తప్పించుకున్నాడు?’’ అంటూ పంజాబ్‌- హరియాణా హైకోర్టు(Punjab- Haryana High Court) మంగళవారం పంజాబ్‌(Punjab) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరారీలో ఉన్న ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అతడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, విడుదలకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.ఎస్‌.షెకావత్‌ విచారణ చేపట్టారు. అయితే, అమృత్‌పాల్‌ పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకోవడం పోలీసుల నిఘా వైఫల్యమేనని పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలంటూ పంజాబ్‌ పోలీసుల(Punjab Police)ను ఆదేశించింది. అమృత్‌పాల్‌ పంజాబ్ సరిహద్దులు దాటి ఉంటాడని పోలీసులు అనుమానిస్తోన్న వేళ.. హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. అమృత్‌పాల్‌ సింగ్‌పై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించామని పంజాబ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినట్లు సమాచారం.

ఒక్క అవాంఛనీయ ఘటన జరగలేదు.. సీఎం మాన్‌

రాష్ట్రంలో శాంతిసామరస్యాలకు విఘాతం కలిగించేందుకు యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. అమృత్‌పాల్‌ ఆచూకీ కోసం పోలీసులు చేపడుతోన్న ఆపరేషన్‌పై సీఎం మాన్‌ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలతోపాటు దేశ పురోగతే తన ప్రాధాన్యాలని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులను వదిలిపెట్టబోమని తెలిపారు. ‘ఈ ఆపరేషన్‌ విషయంలో మూడు కోట్ల మంది పంజాబీ ప్రజలు.. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. తాజా పరిణామాల నడుమ.. రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు ఒక్క నివేదిక కూడా రాలేదు. ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నారనేదానికి ఇదే నిదర్శనం’ అని మాన్ మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని