Raghuram Rajan: భారత ఆర్థిక వృద్ధి అందులోనే ఉంది.. రఘురామ్‌ రాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు....

Updated : 31 Jul 2022 11:50 IST

రాయ్‌పూర్‌: ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ఆర్థిక పురోగతికి ఇది ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒక విభాగమైన ‘ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌’ రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఐదో వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మెజారిటీవాదం బలపడి.. ఒకదేశ రాజకీయ నాయకులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తే అది దేశాన్నే విభజిస్తుందని వ్యాఖ్యానించారు. ఫలితంగా దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం కూడా చోటుచేసుకునే పరిస్ధితి వస్తుందన్నారు. ‘‘భారత ఆర్థిక వృద్ధికి ఉదారవాద ప్రజాస్వామ్య అవసరమెంత’’ అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని రాజన్‌ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిరేటు మందగించడానికి కొవిడ్‌-19 సంక్షోభం ఒక్కటే కారణం కాదన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్‌ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదన్నారు. యువకులకు అవసరమైన స్థాయిలో ఉద్యోగాలు సృష్టించలేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో చెప్పడానికి కొత్త సైనిక నియామకాల పథకం ‘అగ్నిపథ్‌’పై చెలరేగిన ఆందోళనలే ఉదాహరణ అని వివరించారు. దేశంలో ఇప్పటికీ మెజారిటీ మహిళలు ఇంటికే పరిమితమవుతున్నారని తెలిపారు. అయినా, ఉద్యోగాల్లో పోటీ ఈ స్థాయిలో ఉండడం విచారకరమన్నారు. 35 వేల రైల్వే ఉద్యోగాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని