Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుపడింది. సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 24 Mar 2023 15:37 IST

దిల్లీ: కాంగ్రెస్‌(Congress) పార్టీకి లోక్‌సభలో పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం(Lok Sabha secretariat)  నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు ఆయనకు రెండెళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే.. ఆ  తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లోక్‌సభ సచివాలయం చర్యలు చేపట్టింది. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ (Rahul Gandhi) వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.

దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై గురువారం విచారించిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల పాటు జైలు శిక్షవిధించింది. రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడినవారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్‌సభ సచివాలయం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం- రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ గాంధీ  ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం దోషిగా తేలిన తేదీ నుంచి (23 మార్చి, 2023) అనర్హుడైనట్టు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది.  భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.  లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ స్పందించారు. లోక్‌సభ సచివాలయం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘లోక్‌సభ సచివాలయం ఒక ఎంపీపై అనర్హత వేటు వేయరాదు. రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌తో సంప్రదించిన తర్వాత చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

పోరాటం కొనసాగుతుంది.. కాంగ్రెస్‌ ట్వీట్‌

‘‘రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఆయన మీ కోసం, ఈ దేశం కోసం వీధుల నుంచి మొదలుకొని పార్లమెంటు వరకు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సాధ్యమైన ప్రతీ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కుట్రలు జరిగినా సరే.. ఆయన ఎట్టిపరిస్థితుల్లో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. న్యాయపరంగా ముందుకెళ్తారు. పోరాటం కొనసాగుతుంది..’’ అని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు ఇటీవల లోక్‌సభలో రాహుల్‌ ప్రదర్శించిన మోదీతో అదానీ ఉన్న ఓ చిత్రాన్ని జత చేసింది.

ఇది కక్షసాధింపు చర్యే.. రేవంత్‌

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే రాహుల్‌పై వేటు వేశారని మండిపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్న రేవంత్‌.. ఈ సాయంత్రం 4గంటలకు ఏఐసీసీ ముఖ్య నేతల సమావేశం కానుందన్నారు. తాను కూడా జూమ్‌ వేదికగా పాల్గొంటానని చెప్పారు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌పై పైకోర్టుకు వెళ్లేందుకు అప్పీల్‌ చేసుకొనేందుకు 30 రోజుల సమయం ఇచ్చారనీ. .అయినా వేటు వేయడం కక్షసాధింపు చర్యేనన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని