Jaishankar: విదేశాల్లో భారత్‌ను విమర్శించడం.. రాహుల్‌ గాంధీకి అలవాటే!

విదేశీ గడ్డపై భారత్‌పై విమర్శలు చేయడం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) అలవాటేనని.. అవి దేశ ప్రయోజనాలు అనిపించుకోవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ (S Jaishankar) స్పష్టం చేశారు.

Updated : 08 Jun 2023 19:04 IST

దిల్లీ: విదేశాలకు వెళ్లినప్పుడు భారత్‌పై విమర్శలు గుప్పించడం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) అలవాటేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ (S Jaishankar) పేర్కొన్నారు. దేశ అంతర్గత విషయాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తావించడం దేశ ప్రయోజనం కాదని మండిపడ్డారు. అమెరికాలో (America) ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జై శంకర్‌.. యావత్‌ ప్రపంచం మనల్ని గమనిస్తోందని అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు విదేశాంగ మంత్రి సమాధానాలు ఇచ్చారు.

ఓటు బ్యాంకు రాజకీయాలే..

కెనడాలో (Canada) ఇటీవల ఖలిస్థాన్‌ మద్దతుదారులు చేస్తోన్న ఆందోళనలు, కార్యక్రమాలపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పందించారు. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యపై సంబరాలు చేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘వేర్పాటువాదులు, ఉగ్రవాదులతోపాటు హింసను ప్రేరేపించే వారికి కెనడా ఎందుకు స్థానం కల్పిస్తుందో మనకు అర్థం కావడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఎవరైనా ఎందుకు ఇలా చేస్తారు. ఇది కెనడాకు మంచిది కాదు. సత్సంబంధాలకూ ఇది సరి కాదని భావిస్తున్నా’ అని విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు.

కెనడాపై కఠినంగా స్పందించండి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను గుర్తుకు తెస్తూ కెనడాలో కొందరు సంబరాలు చేసుకున్నట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కెనడాపై కఠినంగా స్పందించాలని విదేశాంగమంత్రి జైశంకర్‌కు కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అటు కెనడా కూడా స్పందించింది. తమ దేశంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందని భారత్‌లోని కెనడా హై కమిషనర్‌ కామెరూన్‌ మాకే పేర్కొన్నారు. వీటిని ఖండిస్తున్నామన్నారు. విద్వేషం, హింసను కీర్తించడం వంటి చర్యలకు కెనడాలో చోటు లేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని