Rahul Gandhi: ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే.. నాకు మాట్లాడే అవకాశం వస్తుంది

లండన్‌ వ్యాఖ్యలను వక్రీకరించిన నేపథ్యంలో.. ఆ వివాదానికి బదులిచ్చేందుకు పార్లమెంట్‌లో తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) స్పీకర్‌ను కోరారు. 

Updated : 16 Mar 2023 19:53 IST

దిల్లీ: భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశీ గడ్డపై చేసిన వ్యాఖ్యలకు పార్లమెంట్‌ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి.ఆయన క్షమాపణ చెప్పాలని అధికార భాజపా డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం రాహుల్ పార్లమెంట్‌కు వచ్చారు. ఈ వివాదంపై స్పందించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. రాహుల్ మాట్లాడే అవకాశం లేకుండా నిమిషాల వ్యవధిలో సభ వాయిదా పడింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘నేను ఈ రోజు పార్లమెంట్‌కు వెళ్లిన మరునిమిషమే సభ వాయిదా పడింది. నా ఆలోచనలను వెల్లడించేందుకు సభకు వెళ్లాను. భారతలో ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే.. నేను  పార్లమెంట్‌(Parliament)లో నా మాట చెప్పగలను. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం. నాపై ఆరోపణలు చేస్తున్న మంత్రులకు ఇచ్చినట్టే సభలో మాట్లాడేందుకు ఒక ఎంపీకి అవకాశం దక్కుతుందా..? వారు నన్ను మాట్లాడనిస్తారని నేను అనుకోవడం లేదు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తాను లోక్‌సభ స్పీకర్‌ను కోరానని చెప్పారు. ‘సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వమని నేను స్పీకర్‌ను కోరాను. అక్కడ మాట్లాడటం నాకున్న హక్కు. అయితే ఆయన నాకు హామీ ఇవ్వలేదు. ఒక చిరునవ్వు నవ్వారు’ అని వెల్లడించారు. ‘నేను లండన్‌లో మాట్లాడిన మాటలను ఉద్దేశపూర్వకంగానే వక్రీకరిస్తున్నారు. కేంద్రం, ప్రధాని మోదీ.. అదానీ అంశంపై ఆందోళనగా ఉన్నారు. అందువల్లే ఈ వివాదాన్ని సిద్ధం చేశారు’ అని విమర్శించారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని