రైతులను అడ్డుకునేందుకు గోడలా?: రాహుల్

పోరు బాట పట్టిన రైతులను కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు

Published : 03 Feb 2021 02:18 IST

కేంద్రంపై కాంగ్రెస్ నేత విమర్శ

దిల్లీ: పోరు బాట పట్టిన రైతులను కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని పంజాబ్, హరియాణా, యూపీ, తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు రెండు నెలలకు పైగా దిల్లీ శివారుల్లో నిరసన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నిరసన ప్రాంతాల్లో బారీకేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేసింది. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ..‘గోడలు కాదు..వంతెనలు నిర్మించండి’ అంటూ రాహుల్ కేంద్రంపై మండిపడ్డారు. 

బారీకేడ్లను ఏర్పాటు చేయడం, భారీ ఎత్తున పోలీసులను మోహరించడంతో దిల్లీ సరిహద్దు ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రైతులు గాజీపూర్-మేరఠ్‌ జాతీయరహదారి మీదుగా దిల్లీకి చేరకుండా పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. హరియాణా సరిహద్దులో తాత్కాలిక సిమెంట్ గోడలు కూడా వెలిసినట్లు వార్తా కథనాల ద్వారా వెల్లడవుతోంది. అలాగే సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌కు చెందిన మరో నేత ప్రియాంకా గాంధీ షేర్ చేశారు. అక్కడ పోలీసుల మోహరింపును ఉద్దేశించి..‘మీరు రైతులతో యుద్ధం చేయాలా?’ అంటూ ప్రధానమంత్రిని సూటిగా ప్రశ్నించారు. 

ఇవీ చదవండి:

రాజ్యసభలో రసాభాస..విపక్షాలు వాకౌట్

కరోనా: భారత్‌కు భారీ ఊరట



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని