Odisha Train Tragedy: కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది?.. వెలుగులోకి ట్రాఫిక్‌ ఛార్ట్‌

ఒడిశాలో (Odisha) రైలు ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో వివరిస్తూ.. రైల్వే ట్రాఫిక్‌ అధికారులు ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ (Rail Traffic Chart) లే అవుట్‌ను విడుదల చేశారు. రైలు ట్రాఫిక్‌ను ట్రాక్‌ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. 

Updated : 03 Jun 2023 18:32 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని (Odisha) బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మంది మృతి చెందగా.. 900 మందికి పైగా  క్షతగాత్రులైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలియజేసే ‘రైల్‌ ట్రాఫిక్‌ ఛార్ట్‌’ (Rail Traffic Chart) తాజాగా వెలుగులోకి వచ్చింది. రైలు ట్రాఫిక్‌ను ట్రాక్‌ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. రైల్వే ట్రాఫిక్‌ అధికారులు ఈ లేఅవుట్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం కచ్చితంగా ఏ ప్రదేశంలో ప్రమాదం జరిగిందో గుర్తించేందుకు వీలుంటుంది.

ఈ చిత్రాన్ని ఓ సారి పరిశీలిస్తే.. మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో మధ్యలైన్‌ ‘అప్‌ మెయిన్‌’. ఇందులోనే షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దానికి కుడివైపున ఉన్న లైన్‌ ‘ డౌన్‌ మెయిన్‌’. బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ లైన్‌లోనే వెళ్లింది. అయితే, అప్‌మెయిన్‌ లైన్‌లో వెళ్తున్న కోరమాండల్‌ అక్కడ క్రాసింగ్‌ పాయింట్‌ ఉండటంతో పొరపాటున కామన్‌ లూప్‌లోకి వచ్చేసింది. దీంతో అప్పటికే ఆ లైన్‌లో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలును బలంగా ఢీ కొట్టింది. ఈ హఠాత్పరిణామంతో కోరమాండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న ‘డౌన్‌ మెయిన్‌ లైన్‌’లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్‌ అవుతున్న బెంగళూరు-హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైలు వాటిని ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిపోయింది.

మెయిన్‌లైన్‌లో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు మార్గం సుగమం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లను ట్రాఫిక్‌ అధికారులు లూప్‌లైన్‌లోకి పంపిస్తారు. కొద్దిసేపటి తర్వాత, సిగ్నల్‌ క్లియరెన్స్‌ను బట్టి మళ్లీ వాటిని మెయిన్‌లైన్‌లోకి అనుమతిస్తారు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సిగ్నల్స్‌ సమస్యకారణంగానే ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ కూడా తాజాగా తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని