Indian Railway: వారికి మాత్రమే ‘సీనియర్‌’ రాయితీ.. ప్రయాణికులపై ‘ప్రీమియం’ పిడుగు!

Railway concessions: రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేస్తామనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన వేళ రైల్వే శాఖ యూటర్న్‌ తీసుకుంది.

Updated : 27 Jul 2022 17:43 IST

దిల్లీ: రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేస్తామనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన వేళ రైల్వే శాఖ యూటర్న్‌ తీసుకుంది. వారికి రాయితీ పునరుద్ధరించనుంది. అయితే, ఇందులోనూ ఓ మెలిక పెట్టనుంది. కేవలం 70 ఏళ్లు పైబడి జనరల్‌, స్లీపర్‌ తరగతుల్లో ప్రయాణానికే రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కొవిడ్‌ సమయంలో రైల్వేలో ఉన్న అన్ని రాయితీలూ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రాయితీలు పునరుద్ధరించినప్పటికీ.. వృద్ధులకు రాయితీని మాత్రం పునరుద్ధరించలేదు. దీన్ని పునరుద్ధరించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కొవిడ్‌ ముందు 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 ఏళ్లు దాటిన పురుషులకు రాయితీ వర్తించేది. మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం టికెట్‌లో రాయితీ ఇచ్చేవారు. అయితే, ఇకపై కేవలం 70 ఏళ్లు దాటిన వారికి మాత్రమే రాయితీ ఇవ్వాలని రైల్వే యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదీ కేవలం నాన్‌-ఏసీ తరగతులకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీనిపై సమీక్ష జరుగుతోందని, పూర్తి స్థాయిలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనివల్ల భారం తగ్గుతుందని రైల్వే బోర్డు భావిస్తోంది.

ప్రీమియం బాదుడు..

మరోవైపు రైల్వే తన ఆదాయం పెంచుకునేందుకు మరో ఆలోచన చేస్తోంది. అన్ని రైళ్లలోనూ ప్రీమియం తత్కాల్‌ కోటాను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 రైళ్లలో మాత్రమే ప్రీమియం తత్కాల్‌ కోటా అమలౌతోంది. ఈ స్కీమ్‌ కింద కొన్ని టికెట్లను కేటాయిస్తారు. వీటికి డైనమిక్‌ ఫేర్‌ అమలౌతుంది. తత్కాల్‌ కోటాతో పోలిస్తే ఈ టికెట్లు కాస్త ఖరీదుగానే ఉంటాయి. సీట్లు భర్తీ అవుతున్న కొద్దీ టికెట్‌ ధర పెరుగుతూ ఉంటుంది. చివరి నిమిషంలో బుక్‌ చేసుకున్న వారికి మాత్రం వాత తప్పదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని