Rains: భారీ వర్షాలతో ముంబయికి ఆరెంజ్‌ అలర్ట్‌.. హిమాచల్‌లోనూ వరదలు

రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా

Published : 06 Jul 2022 11:29 IST

ముంబయి/సిమ్లా: రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలు మునిగిపోవడంతో స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.

ముంబయిలో గత సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం వరకు ముంబయి సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబయికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఠాణేలో వ్యక్తి మృతి..

ముంబయి సహా ఠాణే, పాల్ఘర్‌ జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. ఠాణేలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై గుంత కారణంగా కింద పడ్డాడు. అదే సమయంలో వచ్చిన బస్సు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నిన్న అధికారులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

అకస్మాత్తుగా వరదలు.. ఆరుగురు గల్లంతు..

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కులూ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతిలో ఆరుగురు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపట్టామన్నారు. వరదల కారణంగా జిల్లాలోని మలానా, మణికరణ్‌ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లాలోని ధల్లీ టన్నెల్ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతిచెందారు. అటు బిహార్‌లోనూ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు