Shanti Dhariwal: ‘అత్యాచార కేసుల్లో నంబర్‌ వన్‌.. ఎందుకంటే మాది పురుషుల రాష్ట్రం’

అత్యాచారాల విషయంలో రాజస్థాన్‌ మంత్రి ఒకరు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అత్యాచార కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే.. రాజస్థాన్‌ పురుషుల రాష్ట్రం’ అని రాష్ట్ర శాసనసభ...

Published : 11 Mar 2022 01:54 IST

రాజస్థాన్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

జైపుర్‌: అత్యాచారాల విషయంలో రాజస్థాన్‌ మంత్రి ఒకరు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అత్యాచార కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే.. రాజస్థాన్‌ పురుషుల రాష్ట్రం’ అని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శాంతి ధరివాల్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో మంత్రి మాటలపై స్థానికంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహ్‌జాద్‌ ట్వీట్‌ చేశారు. ప్రియాంక గాంధీ ఈ విషయంలో మౌనం వహిస్తున్నారన్నారు.

జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజస్థాన్ ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్రంలోని మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. పోలీసులు ఏం చేయడం లేదు. ఇలాంటి మంత్రులు ఉంటే రాష్ట్ర మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారు?’ అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. సంబంధిత మంత్రిని సభ నుంచి సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజస్థాన్‌ స్పీకర్ సీపీ జోషికి లేఖ రాశారు. అయితే.. తాను నోరు జారానని, క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని సదరు మంత్రి ప్రకటించారు. తాను ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తానని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు