Rajiv Gandhi: రాజీవ్‌ గాంధీ హత్య కేసు.. దోషులందర్నీ విడుదల చేయండి: సుప్రీం

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నళిని సహా దోషులందరూ జైలు నుంచి బయటకు రానున్నారు.

Updated : 11 Nov 2022 14:59 IST

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల ముందస్తు విడుదలకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. దోషులు నళిని సహా ఆరుగురిని విడుదల చేయాలని ఆదేశించింది.

ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన దోషి ఎ.జి. పేరరివాళన్‌ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ ఆదేశాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో తమను కూడా ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ దోషులు నళిని, రవిచంద్రన్‌ తదితరులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం.. పేరరివాళన్‌ కేసులో తీర్పే వీరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీరిద్దరితో పాటు మిగతా నలుగురు రాబర్ట్‌ పయాస్‌, జయకుమార్‌, మురుగన్‌, శాంతన్‌ విడుదలకు కూడా కోర్టు ఆదేశించింది. ఇతర కేసుల్లో వీరికి జైలు శిక్ష అవసరం లేకపోతే.. వారిని జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

వీరిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖత చూపడంతో పాటు సోనియా గాంధీ కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత రాకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రతివాదులుగా ఉన్న కేంద్రం సహా అందరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాతే దోషుల విడుదలకు ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం పేరరివాళన్‌ మినహా మిగతా ఆరుగురు దోషులు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీపై ధను అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ దుర్ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో వారికి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాదే పేరరివాళన్‌ సహా మురుగన్‌, నళిని, శాంతన్‌ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్‌, మురుగన్‌ మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. ఇక, సోనియాగాంధీ జోక్యంతో 2000 సంవత్సరంలో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురికి కూడా మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని