బెంగళూరులో యుద్ధవిమానాల విన్యాసాలు

భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని చాటిచెప్పే వైమానిక ప్రదర్శన కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైంది. ఎయిరో ఇండియా ప్రదర్శనను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో

Updated : 03 Feb 2021 15:01 IST

ఎయిర్‌షోను ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

బెంగళూరు: భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని చాటిచెప్పే వైమానిక ప్రదర్శన కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైంది. ఎయిరో ఇండియా ప్రదర్శనను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప పాల్గొన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారి వేళ ఎయిరో షోలో అనేక దేశాలకు చెందిన సంస్థలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శనలో భౌతికంగా, వర్చువల్‌గా పాల్గొన్న సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారత రక్షణరంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆత్మనిర్భర్‌‌ భారత్‌ అభియాన్‌ కింద రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా వచ్చే 7-8 సంవత్సరాల్లో 130 బిలియన్‌ డాలర్లతో దళాలను ఆధునీకరించనున్నాం’’ అని తెలిపారు. కరోనా దృష్ట్యా ఈ సారి హైబ్రిడ్‌ ఎయిర్‌షోగా దీన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకు డిజిటల్‌ వేదికల ద్వారానే ఈ ప్రదర్శనను వీక్షించే వీలు కల్పించారు.

సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నాం..

లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్-చైనా ప్రతిష్టంభన గురించి రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు, దేశ ప్రజల రక్షణకు భారత్‌ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని అన్నారు. సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తంగా ఉందని, ఎటువంటి దుస్సాహసాలకైనా గట్టిగా సమాధానం చెబుతామని అన్నారు.  

‘తేజస్‌’ కొనుగోలుకు ఒప్పందం

ఈ సందర్భంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి 83 తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.48వేల కోట్లతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. రాజ్‌నాథ్ సమక్షంలో రక్షణశాఖ, హాల్‌ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ యుద్ధ విమానాల ఒప్పందానికి గత నెల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్‌నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ రంగ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ‘మేకిన్‌ ఇండియా’ రక్షణ ఒప్పందం కానుందని అన్నారు. 

దేశ, విదేశీ సమ్మేళనం..

ఈసారి ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 601 సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. ఆద్యంతం ఆసక్తి కలిగించే రఫేల్‌ జెట్, అమెరికా అపాచి హెలికాప్టర్లు భారతీయ సైన్యం తరఫున విన్యాసాలు చేయనున్నాయి. అమెరికాకు చెందిన బి-1బి లాన్సర్‌ సూపర్‌సానిక్‌ బాంబర్ ఈ ప్రదర్శనలో కనువిందు చేస్తోంది.‌

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి..

రక్షణ రంగంలో స్వావలంబన ఆ భయంతోనే తిరుగుబాటు?

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని