Patanjali: ‘పతంజలి పేరు వాడొద్దు’.. రామ్‌దేవ్‌కు భాజపా ఎంపీ వార్నింగ్‌!

ఆధునిక యోగా పితామహుడిగా భావించే మహర్షి పతంజలి పేరు తమ వ్యాపారాలకు వాడుకోవడం మానుకోవాలని భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ రామ్‌దేవ్‌ బాబాకు సూచించారు.

Published : 25 Nov 2022 01:36 IST

గోండా (యూపీ):  యోగా పితామహుడిగా భావించే మహర్షి పతంజలి పేరు తమ వ్యాపారాలకు వాడుకోవడం మానుకోవాలని భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ రామ్‌దేవ్‌ బాబాకు సూచించారు. ఆ మహానుభావుడి పేరును వాడుకుని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామ్‌దేవ్‌.. పతంజలి పుట్టిన గ్రామానికి ఏమీ చేయలేదని విమర్శించారు. రామ్‌దేవ్‌, పతంజలి ఎండీ బాలకృష్ణ వెంటనే తమ బ్రాండ్‌కు పతంజలి పేరును వాడడం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోండా జిల్లా కొండార్‌ గ్రామ పంచాయతీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘మహర్షి పతంజలి పేరును వాడుకుంటూ దేశంలో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వారి వ్యాపారం గురించి నాకు అనవసరం. కానీ, నెయ్యి, సబ్బులు, ప్యాంట్లు, లోదుస్తులకు ఆయన పేరు వాడుకోవడం ఎంత వరకు సమంజసం? అయినా వారికి ఆ హక్కు ఎవరిచ్చారు?’’ అని ప్రశ్నించారు. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. అయోధ్యకు వచ్చే యాత్రికులు కొండార్‌ను సందర్శించాలని, పతంజలి పేరుతో నెయ్యి తింటున్న వారు ఆయన స్వగ్రామం ఎలా ఉందో ఓ సారి చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి బ్రిజ్‌ భూషణ్‌ నేతృత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని