ఎలుకలే.. 12 బాటిళ్ల మందు తాగేశాయి!

ధాన్యం దాచిపెట్టే గోదాముల్లో, సరుకులు దాచిపెట్టే గదుల్లో ఎలుకలు చొరబడి బస్తాలను, సంచులను కొరికేసి అందులోని ఆహారాన్ని తినేస్తుంటాయి. అయితే, విచిత్రంగా ఎలుకలు మద్యం దుకాణాంలో దూరి మందు బాటిళ్లు ఖాళీ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది

Published : 08 Jul 2021 02:12 IST

చెన్నై: ధాన్యం దాచిపెట్టే గోదాముల్లో, సరుకులు దాచిపెట్టే గదుల్లో ఎలుకలు చొరబడి బస్తాలను, సంచులను కొరికేసి అందులోని ఆహారాన్ని తినేస్తుంటాయి. అయితే, విచిత్రంగా ఎలుకలు మద్యం దుకాణంలో దూరి మందు బాటిళ్లు ఖాళీ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నీలగిరి జిల్లా గుడలూర్‌లో తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్‌ మద్యం దుకాణం కరోనా.. లాక్‌డౌన్‌ వల్ల గతంలోనే మూతపడింది. ఇటీవల ఆంక్షలు సడలించడంతో టాస్మాక్‌ ఉద్యోగులు తిరిగి ఈ మద్యం దుకాణాన్ని తెరిచారు. కాగా.. దుకాణంలో 12 బాటిళ్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు దుకాణానికి చేరుకొని పరిశీలించగా.. మద్యాన్ని ఎలుకలు తాగినట్లు గుర్తించారు. దుకాణంలోకి ఎలుకలు వచ్చే మార్గం, బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండటం, బాటిళ్లు ఖాళీ అవడం చూస్తే మద్యాన్ని ఎలుకలే తాగేసి ఉంటాయని నిర్థరణకు వచ్చారు. చాలాకాలంగా దుకాణం మూతపడి ఉండటంతో ఎలుకలు చొరబడి మద్యం బాటిళ్లను ఖాళీ చేసి ఉంటాయని వెల్లడించారు. ఎలుకలు తాగేసిన మద్యం బాటిళ్ల విలువ ₹1,500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని