వణుకు పుట్టిస్తున్న ‘మహా’మ్మారి

మహారాష్ట్రలో కరోనా రెండో ఉద్ధృతి మొదలైనట్లే కన్పిస్తోంది. అక్కడ నమోదవుతున్న రోజువారీ కేసులు యావత్‌ దేశాన్ని కలవరపెడుతున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కొత్త కేసుల

Updated : 17 Mar 2021 10:59 IST

మహారాష్ట్రలో 6 నెలల తర్వాత మళ్లీ 17వేల కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా రెండో ఉద్ధృతి మొదలైనట్లే కన్పిస్తోంది. అక్కడ నమోదవుతున్న రోజువారీ కేసులు యావత్‌ దేశాన్ని కలవరపెడుతున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కొత్త కేసుల సంఖ్య 17వేలు దాటడం గమనార్హం. మంగళవారం 17,864మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో(28,903) 61శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చివరిసారిగా గతేడాది సెప్టెంబరులో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 23,47,328కి చేరింది. అత్యధికంగా పుణెలో 1,954, నాగ్‌పూర్‌లో 1,951, ముంబయిలో 1,922 కేసులు వెలుగుచూశాయి. 

మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 87 మంది వైరస్‌కు బలయ్యారు. దేశవ్యాప్తంగా నమోదైన రోజువారీ మరణాల్లో(188) సగానికి పైగా ఒక్క ఈ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 52,996కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో మరో 9,510 మంది వైరస్‌ను జయించగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 21,54,253గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,38,813 క్రియాశీల కేసులున్నాయి. 

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా గత పది రోజులుగా కొవిడ్‌ కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాలను కేంద్రం గుర్తించింది. మొత్తం 19 జిల్లాల్లో రోజువారీ కేసులు పెరుగుతుండగా.. అందులో 15 కేవలం మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఈ జిల్లాల్లో గత పదిరోజులుగా కొత్త కేసుల సంఖ్య వెయ్యికి పైనే ఉంటోంది.  

నిర్లక్ష్యమే ప్రధాన కారణం..!

మహారాష్ట్రలో మళ్లీ వైరస్‌ విజృంభణకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర బృందం నివేదికలో తేల్చింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ప్రజలు కూడా కొవిడ్‌ నిబంధలను పట్టించుకోవడం లేదని, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంటివాటిని గాలికొదిలేస్తున్నారని స్పష్టం చేసింది. కరోనా సోకి స్వల్ప లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేనివారు ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతుండటం.. సామాజిక వ్యాప్తికి కారణమవుతున్నట్లు పేర్కొంది. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని హెచ్చరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు