Odisha train accident: ‘నీళ్లను చూసినా రక్తంలాగే అనిపిస్తోంది’ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సవాళ్లు..!

ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు చేపడుతోన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది అక్కడి పరిస్థితులు చూసి తీవ్రంగా కలత చెందుతున్నారట.

Published : 07 Jun 2023 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలేశ్వర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం (Odihsa Train Accident) వందల మంది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి ఒకవిధంగా ఉంటే.. మరణించిన కుటుంబీకుల పరిస్థితి హృదయవిదారకం. గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు వారు పడుతున్న ఆరాటం ఓవైపు.. అసలు తమ వారు ఎక్కడున్నారోనని మరికొందరి వేదన మరోవైపు. ఇలా అక్కడ నెలకొన్న పరిస్థితులు ప్రతిఒక్కరినీ కలచివేస్తున్నాయి. అయితే, ఇంతటి భీకరస్థితిలో సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారట. నీళ్లను చూసిన ప్రతిసారి దాన్ని రక్తంగా ఒకరు భావిస్తుంటే.. మరొకరు మాత్రం ఆకలి కోరికే మరచిపోయారట. ఇలా తమ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ వెల్లడించారు.

‘ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. నీటిని చూసిన ప్రతిసారి రక్తమేనని ఒక సిబ్బంది భ్రమ పడుతుంటే.. మరొకరు మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత ఆకలి కోరికే పోయిందని చెప్పారు. ఇలా మా సిబ్బంది ఎదుర్కొంటున్న ఈ తరహా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేస్తాం’ అని ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ అతుల్‌ కర్వాల్‌ పేర్కొన్నారు.

ఒడిశా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన 300మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో కీలకంగా వ్యవహరించారు. 44 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీయడంతోపాటు 121 మృతదేహాలను వెలికి తీశారు. ఆ ప్రమాద తీవ్రతను చూసిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో కొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ వెల్లడించడం గమనార్హం. అయినప్పటికీ మొత్తంగా 18వేల మందితో కూడిన తమ బలగాల్లో దాదాపు 95శాతం మంది కచ్చితమైన ఫిట్‌నెస్‌తో ఉంటారని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని