
యాంటీబాడీలను కనిపెట్టే రక్తపరీక్ష
అభివృద్ధి చేసిన హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు
ఇంటర్నెట్డెస్క్: కరోనాతో పోరాడే యాంటీబాడీలను గుర్తించడానికి సరికొత్త రాపిడ్ బ్లడ్ టెస్టును అభివృద్ధి చేశారు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ పద్ధతి ద్వారా అయిదు నిమిషాలకన్నా తక్కువ సమయంలో శరీరంలో యాంటీ బాడీలను గుర్తించవచ్చు. కరోనా సోకిన రోగుల నుంచి సేకరించిన 400 రక్త నమూనాలను ఈ పద్ధతిలో పరీక్షించగా 87.5 శాతం కచ్చితత్వంతో యాంటీబాడీలను గుర్తించింది. బ్లడ్గ్రూప్ తెలుసుకోవడానికి చేసే రక్తపరీక్షలాగే ఇది ఉంటుందని పరిశోధకులు తెలిపారు. టెస్టు చేయాల్సిన వ్యక్తి వేలిని గుచ్చి ఒక కార్డుపై రక్తపు చుక్కను సేకరిస్తారు. ఆ కార్డు మీద నూతనంగా అభివృద్ధి చేసిన ఫ్యూజన్ ప్రొటిన్ ఉంచి యాంటీబాడీలను గుర్తిస్తారు. ప్రస్తుతం యాంటీబాడీలను గుర్తించేందుకు చేస్తున్న లేటరల్ ఫ్లో పరీక్ష కన్నా ఇది వేగంగా, స్పష్టమైన ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు తెలిపారు. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలైన విమానాశ్రయాలు, స్టేడియాల్లో ప్రజలను పరీక్షించడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్కి బదులుగా ఈ పద్ధతి ద్వారా టీకా తీసుకున్నారో లేదోననే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.