H3N2: కాన్పూర్‌కు జ్వరమొచ్చింది.. H3N2 లక్షణాలతో భారీగా ఆసుపత్రులకు జనం

కొవిడ్‌ మహమ్మారి తర్వాత మరో రకం వైరస్‌ ప్రజలను భయపెడుతోంది. హెచ్‌3ఎన్‌2 రకం వైరస్‌ కారణంగా కాన్పూర్‌లో ఒక్క రోజులోనే దాదాపు 50 మంది ఆసుపత్రిపాలైనట్లు సమాచారం. 

Published : 08 Mar 2023 11:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందనుకొంటున్న సమయంలో హెచ్‌3ఎన్‌2(H3N2) ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలోని హాల్లెట్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజులో జ్వరం, నిరంతరాయంగా దగ్గు, శ్వాసకోశ సమస్యలతో 200 కేసులు వచ్చాయి. వీటిల్లో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి బయట రోగులు బారులు తీరారు. మరోవైపు ప్రైవేటు వైద్యశాలలకు కూడా జ్వర బాధితులు పోటెత్తారు. ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న  హెచ్‌3ఎన్‌2 (H3N2) వైరస్‌ గత నెల రోజులుగా నగరంలో తీవ్రంగా వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు.

హాల్లెట్‌ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ‘‘తొలుత ఐదు నుంచి ఆరు రోజుల పాటు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో కాన్పూర్‌ లోని వైద్యశాలకు తరలించాం’’ అని ఓ పేషెంట్‌ బంధువు వెల్లడించారు. 

ఈ పరిస్థితిపై ఆసుపత్రిలోని మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి రిచా గిరి మాట్లాడుతూ ‘‘వాస్తవానికి ప్రతిఏటా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఇటువంటి కేసులు చూస్తాం. కానీ, ఈ సారి పేషేంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారిలో ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. గత 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది వైద్యశాలలో చేరారు. వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నారు. వీరిలో కొంతమందికి బైపాప్‌ యంత్రం కూడా వాడాల్సి వచ్చింది. కొవిడ్‌-19 కాకుండా వేరే వైరస్‌గా గుర్తించడం చాలా క్లిష్టం. ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌లో ప్రతి ఉపరకానికి ప్రత్యేకమైన కిట్‌ ఉంది’’ అని వెల్లడించారు.

ఇటీవల దేశవ్యాప్తంగా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో దాదాపు సగం మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారే. వీరితో పాటు బయటి రోగుల్లో అత్యధికులకు హెచ్‌3ఎన్‌2 రకం వైరస్‌ కారణంగానే ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు ఐసీఎంఆర్‌ చెబుతోంది. హెచ్‌3ఎన్‌2 ఉపరకాలు సాధారణ ఇన్‌ఫ్లూయెంజా వేరియంట్ల కంటే బలంగా ఉండటమే ఇందుకు కారణం. ఇది సోకిన 92శాతం వ్యక్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్ములు ప్రధాన లక్షణాలుగా ఉంటున్నాయి. ఈ వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని