Rivaba Jadeja: జడేజా సతీమణికి భాజపా టికెట్‌..?

గుజరాత్‌లో రెండు దశాబ్దాలకు పైగా భాజపా అధికారంలో ఉంది. ఈ క్రమంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను బుధవారం ఖరారు చేయనుంది. 

Updated : 09 Nov 2022 12:50 IST

దిల్లీ: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను ఆకర్షిస్తున్నాయి. అధికార భాజపాను ఢీకొట్టేందుకు ఆప్‌ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కమలం పార్టీ ఖరారు చేయనుంది. ఆ నిమిత్తం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కాగా, ఈ అభ్యర్థుల తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా పేరు వినిపిస్తోంది. ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

రీవాబా జడేజా మెకానికల్ ఇంజినీర్‌. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన నాయకురాలైన ఈమె.. మూడు సంవత్సరాల క్రితం భాజపాలో చేరారు. ప్రముఖ రాజకీయనేత హరి సింగ్‌ సోలంకికి రీవాబా దగ్గరి బంధువు. ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో రెండు దశాబ్దాలకు పైగా భాజపా అధికారంలో ఉంది. ఈసారి కూడా దానిని నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు, సిట్టింగ్ అభ్యర్థులు, 75 ఏళ్లు దాటినవారిని పక్కనబెట్టనుందని ఆ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌కు కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన హార్దిక్‌ పటేల్, అల్పేశ్‌ ఠకోర్‌ టికెట్లు దక్కించుకోనున్నట్లు సమాచారం. 

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ కమిటీ సమావేశమవుతుంది. ఇక డిసెంబర్ ఒకటి, ఐదు తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల ఎనిమిదిన ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని