Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!

కలెక్టర్‌ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేత.. జైలుకు బదులు ఇంట్లో ప్రత్యక్షమైన ఘటన ఇది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ కావడంతో ఆరుగురు పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు...

Published : 16 Aug 2022 00:26 IST

బిహార్‌లో ఘటన.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్‌

పట్నా: కలెక్టర్‌ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేత.. జైలుకు బదులు ఇంట్లో ప్రత్యక్షమైన ఘటన ఇది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ కావడంతో ఆరుగురు పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మాజీ ఎంపీ, ఆర్జేడీ బాహుబలిగా పేరొందిన ఆనంద్‌ మోహన్‌ సింగ్‌.. ఓ కలెక్టర్‌ హత్య కేసులో బిహార్‌లోని సహర్సా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల సివిల్ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు అతన్ని పట్నాకు తీసుకొచ్చారు. అయితే, న్యాయస్థానంలో హాజరయిన అనంతరం తిరిగి జైలుకు వెళ్లాల్సిన అతను.. మధ్యలో తన నివాసానికి చేరుకుని, కాలక్షేపం చేయడం వివాదాస్పమైంది.

ఈ సందర్భంగా అతను.. భార్య, మాజీ ఎంపీ లవ్లీ ఆనంద్, కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్‌తోపాటు తన అనుచరులను కలుసుకున్నాడు. వారితో ఫొటోలూ దిగాడు. ఇవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో బిహార్ పోలీసులపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. సోమవారం ఆరుగురు పోలీసు సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు. సహర్సా జైలు అధికారులపైనా విచారణ ప్రారంభించారు. ‘ఈ వ్యవహారంలో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశాం. పూర్తి నివేదిక అందిన అనంతరం కఠిన చర్యలు తీసుకుంటాం. జైలు అధికారుల పాత్రపైనా విచారణ జరుగుతోంది' అని సహర్సా ఎస్పీ లిపి సింగ్ తెలిపారు.

మరోవైపు.. ఈ వ్యవహారంపై భాజపా నేతలు విమర్శలకు దిగారు. ఆర్జేడీ- జేడీయూల నూతన ప్రభుత్వంతో రాష్ట్రంలో ‘జంగల్‌ రాజ్‌’ తిరిగొచ్చిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ దిగిన ఫొటోను షేర్ చేసిన భాజపా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూల కొత్త పొత్తుపై విరుచుకుపడ్డారు. ‘డీఎం హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ నేత‌.. జైలుకు బదులు ఇంటికి చేరుకున్నారు. ఇదీ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూల ‘జంగల్ రాజ్’ శక్తి’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని