Robbery: భుజానికి బ్యాగ్ ఉండగానే.. ‘సిగ్నల్‌’ గ్యాప్‌లో రూ.40లక్షలు కొట్టేశారు..!

ట్రాఫిక్‌ రద్దీలో అందరూ చూస్తుండగానే ముగ్గురు దొంగలు చాకచక్యంగా చేతివాటం (Robbery) ప్రదర్శించారు. వాహనదారుడికే తెలియకుండా అతడి భుజానికి ఉన్న బ్యాగ్‌ నుంచి రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు.

Updated : 07 Mar 2023 14:18 IST

దిల్లీ: అదేదే సినిమాలో.. ఓ వ్యక్తి ముందు పేపర్‌ చదువుతుంటే హీరో అతడి వెనకే కూర్చుని బ్యాగులో నుంచి కోటిన్నర కొట్టేశాడు కదా..! తాజాగా దేశ రాజధాని దిల్లీ (Delhi)లో కాస్త అటుఇటూగా అచ్చం ఇలాంటి చోరీనే జరిగింది. భారీ ట్రాఫిక్‌ మధ్యలో భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని ఉండగానే అందులో నుంచి రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు ముగ్గురు దొంగలు. సీసీటీవీ వీడియోతో ఈ చోరీ (Robbery) బయటపడింది. మార్చి 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మార్చి 1వ తేదీ సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్యాగులో డబ్బు పెట్టుకుని బైక్‌పై రావడాన్ని గమనించిన ముగ్గురు దొంగలు (Robbers).. అతడిని కొంతదూరం అనుసరించారు. మార్గమధ్యంలో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర బైక్‌ ఆగగానే.. వెనకే వచ్చి చోరీకి పాల్పడ్డారు. వాహనదారుడు ముందు సిగ్నల్‌ చూస్తుండగా.. దొంగల్లో ఒకడు వెనుక బ్యాగ్ జిప్‌ తెరిచాడు. మరో వ్యక్తి అందులోని డబ్బుల బ్యాగ్‌ తీసుకుని ఇంకొకరికి అందించాడు. క్షణాల్లో పని ముగించుకుని ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.

ఆ సమయంలో డబ్బులున్న బ్యాగ్‌ను ఆ వాహనదారుడు భుజానికే తగిలించుకుని ఉన్నాడు. అయినా అతడు చోరీని గమనించలేదు. అంతేనా.. ఆ సమయంలో బైక్‌ పక్కనే కార్లు కూడా ఆగి ఉన్నాయి. బైక్‌ ముందు నుంచి కొందరు పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయినా.. ఏ ఒక్కరూ దొంగతనాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ (Viral)గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ (CCTV) దృశ్యాల ఆధారంగా నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. దొంగల నుంచి రూ.38లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ద్విచక్రవాహనదారులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే ముఠా అని పోలీసులు వెల్లడించారు.

ఏదేమైనా.. కొన్నిసార్లు మన కంటికే తెలియకుండా ఇలాంటి దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. డబ్బులతో వెళ్తున్నప్పుడు రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని