కుప్పకూలిన 13 అంతస్తుల టవర్‌..!

పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్‌ మధ్య భీకర పోరు జరుగుతోంది. నిన్న ఇజ్రాయిల్‌ విమానాలు నిర్వహించిన దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్‌ కుప్పకూలింది

Updated : 12 May 2021 11:59 IST

 ప్రతిగా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి

ఇంటర్నెట్‌డెస్క్‌: పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ మధ్య భీకర పోరు జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్‌ విమానాలు నిర్వహించిన దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్‌ కుప్పకూలింది. ఈ భవనంలో హమాస్‌ నాయకుల గృహాలు, కార్యాలయాలు ఉన్నాయి. దాడికి ముందు ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది. గాజాపట్టీలోనే మరో భవనాన్ని కూడా ఇజ్రయెల్‌ దళాలు కూల్చినట్లు వార్తొలొస్తున్నాయి. మొత్తం ఇజ్రాయెల్‌కు చెందిన 80 యుద్ధవిమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం.  

ఇజ్రాయెల్ దళాలు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్ ఆరోపించింది. తాజా దాడిలో టెల్‌ అవీవ్‌లో 50ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.  హమాస్‌ ప్రయోగించిన ఓ రాకెట్‌ టెల్‌అవీవ్‌లోని ఓ ఖాళీ బస్సుపై పడింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఒక బాలిక కూడా ఉంది. హమాస్ దాడులు మొదలు కాగానే చాలా మంది ప్రజలు నగర వీధుల్లో పరుగులు తీసి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకొన్నారు. హమాస్‌ ప్రయోగించిన 90శాతం రాకెట్లను ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షన వ్యవస్థ ఐరన్‌ డోమ్‌ కుప్పకూల్చింది. ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో హమాస్‌ స్పెషల్‌ రాకెట్‌ గ్రూప్‌ అధిపతి షామ అబీద్‌ అల్‌ మామ్‌లక్‌, యాంటీట్యాంక్ యూనిట్‌ కమాండర్‌ కూడా మృతి చెందారు.

మరోపక్క ఇజ్రాయెల్‌ ఎట్టి పరిస్థితుల్లో హమాస్‌ను కోలుకోలేని దెబ్బతీయాలని దాడులను ముమ్మరం చేసింది. మరోపక్క హమాస్‌ కూడా తాము అన్నింటికీ సిద్ధమని ప్రకటించింది. ఆ సంస్థ నాయకులు ఇస్మాయిల్‌ మాట్లాడుతూ ‘‘వారు ఘర్షణలను పెంచాలనుకుంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు శాంతి కోరుకుంటే దానికీ మేము సిద్ధమే’’ అని పేర్కొన్నారు. 
నేడు ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఘర్షణలపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఐరాస మధ్యప్రాశ్చ్యం శాంతి దూత ట్రాడ్‌ వెన్స్‌లాండ్‌ ట్వీట్‌ చేశారు. వెంటనే ఇరుపక్షాలు దాడులను ఆపాలని కోరారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని