
ఆ మంత్రితో సెల్ఫీకి రూ.100 ఛార్జీ..!
దిల్లీ: సినిమా తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు.. ఇలా తాము అభిమానించే వ్యక్తి కనిపిస్తే చాలు ఓ సెల్ఫీ దిగేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తుంటారు. తమ అభిమానులను నిరుత్సాహపరచకూడదని భావించి వారు కూడా ఎంతో ఓపికతో ఫొటోలకు ఫోజులిస్తుంటారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్లో భాజపాకు చెందిన ఓ మంత్రి మాత్రం తనతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్న అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇకపై తనతో సెల్ఫీ తీసుకోవాలంటే రూ.100 చెల్లించాల్సిందేనంటూ షరతు విధించారు.
తనతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నవారు ఇకపై రూ.100 చెల్లించాల్సిందేనని మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకుర్ స్పష్టం చేశారు. చాలామంది సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తనకు గంటలకొద్దీ ఆలస్యం అవుతున్న కారణంగానే తాను ఈ షరతు విధించినట్లు మంత్రి చెప్పారు. సెల్ఫీ తీసుకోవాలనుకున్న వారు డబ్బును స్థానిక భాజపా మండల స్థాయి విభాగం ట్రెజరీలో చెల్లించాలన్నారు. పుష్పగుచ్చాలకు బదులుగా తనకు పుస్తకాలు మాత్రమే ఇవ్వాలని ఆమె కోరారు.