సచిన్‌ వాజే.. రూం నంబరు 1964

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్‌ వాజే గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

Updated : 03 Apr 2021 19:49 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్‌ వాజే గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబయిలోని నారిమన్‌ ప్రాంతంలో గల ఓ ఐదు నక్షత్రాల హోటల్‌ నుంచి వాజే ‘బలవంతపు వసూళ్ల’ రాకెట్‌ను నడిపాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడినట్లు తాజాగా తెలిసింది. దీంతో ఈ హోటల్‌లోని 1964 నంబరు గదిపై అధికారులు దృష్టిపెట్టారు. 

ఆ హోటల్‌లోని రూం నంబరు 1964ను వాజే కోసం ఓ పారిశ్రామికవేత్త 100 రోజులకు బుక్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హోటల్‌ గదికి వాజే.. ‘సుశాంత్‌ సదాశివ్‌ ఖామ్కర్‌’ పేరుతో నకిలీ ఆధార్‌ కార్డుతో చెకిన్‌ అయినట్లు తెలిసింది. ‘‘ఈ లగ్జరీ హోటల్ గదిని ఓ వ్యాపారవేత్త.. ట్రావెల్‌ ఏజెంట్‌ ద్వారా రూ. 12లక్షలు చెల్లించి వంద రోజులకు బుక్‌ చేశాడు. గతంలో వాజే ఆ వ్యాపారవేత్తకు కొన్ని వివాదాల్లో సాయం చేశారు. ఫిబ్రవరి నెలలో వాజే ఇదే గదిలో కొన్ని రోజుల పాటు ఉన్నారు. ఆ సమయంలో ఆయన ముంబయి క్రైం బ్రాంచ్‌లో విధుల్లోనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫిబ్రవరి 16న వాజే టయోటా ఇన్నోవా కారులో ఈ హోటల్‌కు వచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న క్రూయిజర్‌ కారులో వెళ్లిపోయారు’’అని ఎన్‌ఐఏ సీనియర్‌ అధికారి ఒకరు జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించారు. అదే సమయంలోనే వాజే బృందం ముంబయిలోని పలు ప్రముఖ సంస్థల్లో లైసెన్స్‌ నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించడం గమనార్హం. ఆ హోటల్ వద్ద వాజే కన్పించిన ఆ రెండు కార్లు ప్రస్తుతం ఎన్‌ఐఏ స్వాధీనంలో ఉన్నాయి. 

ఎవరా మహిళ..

ఇదిలా ఉండగా.. పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌ఐఏ.. గురువారం దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌, క్లబ్‌తో పాటు ఠాణె జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌లోనూ సోదాలు నిర్వహించింది. అదే రోజున ముంబయి ఎయిర్‌పోర్టులో వాజే సన్నిహితురాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుంది. ఠాణెలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించిన అపార్ట్‌మెంట్‌ ఆ మహిళ పేరు మీదే ఉంది. దీంతో ఈ మహిళకు.. వాజేకు ఉన్న సంబంధంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో లేదా మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసులో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

మరో కారు స్వాధీనం..

పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు, మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసుల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు కార్ల చుట్టూ తిరుగుతోంది. ముంబయిలోని అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియోతో మొదలు ఔట్‌ల్యాండర్‌ వరకు 7 కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో మెర్సిడెస్‌ కారును కూడా ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. వీటిలో కొన్ని వాహనాలకు ముంబయి నగర పోలీస్‌ కమిషనరేట్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది.

వాజే ‘వ్యాపారం’ గురించి సీనియర్‌ పోలీసు అధికారుల్లో చాలా మందికి తెలుసట. దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసుల్లో 35 మంది అధికారులను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని