SKM: 26న దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌లకు మార్చ్‌లు‌.. ఎస్‌కేఎం నిర్ణయం

రైతు ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీల అమలును కేంద్రం విస్మరించిందని ఆరోపిస్తూ రైతు సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

Published : 17 Nov 2022 23:10 IST

దిల్లీ: రైతు ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీల అమలును కేంద్రం విస్మరించిందని ఆరోపిస్తూ రైతు సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌లకు మార్చ్‌లు నిర్వహించాలని నిర్ణయించినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తెలిపింది. తమ ఉద్యమం ఫలితంగా గతేడాది వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ 19ని 'ఫతే దివాస్'గా జరుపుకోనున్నట్టు పేర్కొంది. అలాగే, పెండింగ్‌ సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీల (లోక్‌సభ/రాజ్యసభ) కార్యాలయాలకు డిసెంబర్‌ 1 నుంచి 11 వరకు మార్చ్‌లు నిర్వహించనున్నట్టు ఎస్‌కేఎం నేత దర్శన్‌ పాల్‌ వెల్లడించారు. 

రైతుల అతి పెద్ద డిమాండ్‌గా ఉన్న కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీని కేంద్రం పరిగణనలోకి తీసుకొనేందుకు సిద్ధంగా లేదని నేతలు ఆరోపించారు. సాగు చట్టాలు రద్దు సహా పలు డిమాండ్లపై తాము కొనసాగించిన పోరాటాన్ని ఉపసంహరించుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును పూర్తిగా విస్మరించడంపై ఎస్‌కేఎం నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. కనీస మద్దతు ధరపై కమిటీ వేయలేదని, ఉద్యమం సందర్భంలో రైతులపై పెట్టిన తప్పుడు కేసులనూ ఉపసంహరించుకోలేదని పేర్కొంది. తమ తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు డిసెంబర్‌ 8న మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని