ఓటు వేయలేకపోయిన చిన్నమ్మ

నేడు జరుగుతోన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో..మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తన ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు.

Published : 06 Apr 2021 11:35 IST

ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడమే కారణం

చెన్నై: నేడు జరుగుతోన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో..మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తన ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో ఆమెకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ పరిణామం శశికళను తీవ్రంగా బాధించినట్లు సన్నిహితులు వెల్లడించారు.  

గతంలో చెన్నైలోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శశికళకు ఓటు హక్కు ఉండేదని ఆమె తరఫు న్యాయవాది ఎన్ రాజా వెల్లడించారు. అప్పట్లో ఆమె జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్‌లో ఉండేవారు. అయితే తమిళనాడు ప్రభుత్వం దాన్ని స్మారక చిహ్నంగా మార్చడంతో..శశికళకు ఈ పరిస్థితి ఎదురైంది. కాగా తాజా పరిణామం శశికళను తీవ్రంగా బాధించిందని రాజా మీడియాకు తెలిపారు. బాధ్యులైన వారిపై చిన్నమ్మ చట్టపరంగా ముందుకెళ్లనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇందులో ఎలాంటి కుట్ర లేదని, జాబితాలో ఆమె పేరు ఉందో లేదో పరిశీలించుకోవడం ఆమె బాధ్యతని సంబంధిత ఎన్నికల అధికారి తెలిపారు. పేరు తొలగింపుపై ఇంతకు ముందే ఎన్నికల అధికారులను సంప్రదించగా..మార్పులు, చేర్పులకు గడువు ముగిసిందని సమాధానం వచ్చినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. తాజాగా జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత స్థానంలో కీలక పాత్ర పోషిస్తారనుకున్న శశికళ..అనూహ్యంగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రకటన ప్రతిఒక్కరిని ఆశ్చర్యపర్చింది. దాంతో తమిళనాడులో అధికారం కోసం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధానంగా ఎన్నికల పోరు నడుస్తోంది. 234 నియోజకవర్గాలకు మంగళవారం ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఆ రెండు పార్టీలతో పాటు కమల్‌ హాసన్ పార్టీ భవితవ్యాన్ని నేడు ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని