CBSE: మూల్యాంకన ప్రక్రియలో జోక్యం అవసరంలేదు

పన్నెండో తరగతి విద్యార్థుల ఫలితాలను వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ రూపొందించిన మూల్యాంకన విధానం పారదర్శకంగా, సహేతుకంగా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 22 Jun 2021 19:05 IST

సీబీఎస్‌ఈ ప్రతిపాదనలను అంగీకరించిన సుప్రీంకోర్టు

దిల్లీ: పన్నెండో తరగతి విద్యార్థుల ఫలితాలను వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ రూపొందించిన మూల్యాంకన విధానం పారదర్శకంగా, సహేతుకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కన్పించట్లేదన్న న్యాయస్థానం.. బోర్డుల మూల్యాంకన విధానాలను ఆమోదిస్తున్నట్లు వెల్లడించింది. 

12వ తరగతి విద్యార్థుల వార్షిక ఫలితాలపై సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులు సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ముందు అఫిడవిట్‌ దాఖలు చేశాయి. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే మూల్యాంకన విధానంలో వివాద పరిష్కార యంత్రాంగాన్ని చేర్చినట్లు పేర్కొన్నాయి. ఫలితాలపై అభ్యంతరాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. కమిటీ నిర్ణయంతో కూడా సంతృప్తి చెందని విద్యార్థులకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్యలో ఆప్షనల్‌ పరీక్షలు (ప్రధాన సబ్జెక్టులు మాత్రమే) నిర్వహిస్తామని ప్రమాణ పత్రంలో పేర్కొంది. ఇక, ప్రైవేటు, కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాసే విద్యార్థుల మూల్యాంకనంపై కూడా సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది. 2019-20 సంవత్సరంలో కోర్టు ఆమోదించిన విధానంలోనే మదింపు ఉంటుందని వెల్లడించింది. ఈ అఫిడవిట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. బోర్డుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 

అయితే కంపార్ట్‌మెంట్‌ పరీక్షలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రైవేటు, కంపార్ట్‌మెంట్‌, రిపీటర్‌ విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఆగస్టు 15 - సెప్టెంబరు 15 మధ్య కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామన్న సీబీఎస్‌ఈ ప్రణాళికను కోర్టు అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని