
కరోనా కట్టడికి ఏం చేస్తున్నారు?: సుప్రీం
కేంద్రం, రాష్ట్రాల నుంచి వివరణ కోరిన అత్యున్నత న్యాయస్థానం
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిపై సుప్రీంకోర్టు స్పందించింది. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు మునుపెన్నడూ లేని స్థాయిలో నమోదవుతండడాన్ని పరిగణనలోకి తీసుకుంది. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై వెంటనే నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రాన్ని ఆదేశించింది. మహమ్మారి కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరింది. గుజరాత్, దిల్లీలో పరిస్థితి చేదాటిపోతోందని గుర్తుచేసింది. నవంబరులో దేశ రాజధానిలో పరిస్థితి మరింత దిగజారిందని వ్యాఖ్యానించింది. ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులకు అందిస్తున్న చికిత్స, మృతదేహాల్ని భద్రపరుస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 27కు వాయిదా వేసింది.
గత 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్లలోº ఇదివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లలో గత రెండువారాల్లో ఎన్నడూ రానన్ని సంఖ్యలో కేసులొచ్చాయి. గత మూడురోజుల్లో రెండోసారి రికవరీల కంటే అధిక సంఖ్యలో కొత్త కేసులొచ్చాయి. భవిష్యత్తులో కేసుల పెరుగుదలకు ఈ అంశాలు సంకేతాన్నిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల పరంగా తొలి మూడు స్థానాల్లో ఉన్న దిల్లీ, కేరళ, మహారాష్ట్రల్లో కాస్త అటు ఇటుగా 6 వేలలోపు నమోదయ్యాయి. గడిచిన మూడు రోజులుగా ప్రతి రోజు 100 నుంచి 155 దాకా మరణాలు నమోదైన మహారాష్ట్రలో ఒకేసారి అవి 62కి తగ్గాయి. దిల్లీలో గత నాలుగు రోజుల్లో మూడోసారి 100కి పైగా మరణాలు సంభవించాయి. ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్లకు కేంద్రం నుంచి ఉన్నతస్థాయి బృందాలు చేరుకున్నాయి.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.