కోల్‌కతాలో అభిషేక్‌ బెనర్జీ విచారణ.. ఆటంకం కలిగిస్తే ఊరుకోం: సుప్రీం

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో వీరిని అరెస్టు చేయకుండా

Updated : 17 May 2022 15:39 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో వీరిని అరెస్టు చేయకుండా సర్వోన్నత న్యాయస్థానం రక్షణ కల్పించింది. అంతేగాక, వీరిద్దరినీ కోల్‌కతాలోనే ప్రశ్నించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఈ విచారణకు బెంగాల్‌ ప్రభుత్వం ఆటంకం కలిగించాలని చూస్తే మాత్రం సహించేది లేదని న్యాయస్థానం హెచ్చరించింది.

ఈస్ట్రర్న్‌ కోల్డ్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌కు చెందిన గనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ 2020లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రారంభించింది. ఈ కుంభకోణంలో అభిషేక్‌ బెనర్జీ లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అభిషేక్‌, ఆయన భార్య రుజిరాను ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల మార్చి 21, 22 తేదీల్లో దిల్లీకి రావాలని పిలిచింది. అయితే ఈ సమన్లను సవాల్‌ చేస్తూ బెనర్జీ దంపతులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమను దిల్లీలో కాకుండా కోల్‌కతాలో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. మరోవైపు, ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో అభిషేక్‌ దంపతులపై బెయిలబుల్ వారెంట్‌ జారీ అయ్యింది.

ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు చేరడంతో అభిషేక్‌ దంపతులకు కాస్త ఊరట లభించింది. అభిషేక్, రుజిరాను కోల్‌కతాలోనే ప్రశ్నించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఆయనను విచారించాలనుకుంటే 24 గంటల ముందే సమాచారం ఇవ్వాలని ఈడీకి తెలిపింది. అయితే ఈ విచారణ నిమిత్తం బెంగాల్‌ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ అధికారులు కోల్‌కతా వచ్చినప్పుడు వారికి రక్షణ కల్పించాలని సూచించింది. ఈ విచారణకు రాష్ట్ర యంత్రాంగం నుంచి ఎలాంటి ఆటంకం ఎదురైనా, అనవసర జోక్యం చేసుకున్నా సహించేది లేదని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని