Bhopal Gas Tragedy: అదనపు పరిహారం కేసులో.. కేంద్రం పిటిషన్‌ కొట్టివేత

భోపాల్ గ్యాస్ విషాదాని(Bhopal Gas Tragedy)కి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అదనపు నష్టపరిహారాన్ని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

Updated : 14 Mar 2023 13:05 IST

దిల్లీ: భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాద(Bhopal Gas Tragedy)(1984) బాధితులకు అదనపు నష్టపరిహారం చెల్లించాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది. నాలుగు దశాబ్దాల నాటి అంశాన్ని లేవనెత్తడం వెనక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నిస్తూ దానిని కొట్టివేసింది. విష వాయువు లీకేజీ ప్రమాదానికి కారణమైన యూనియన్‌ కార్బైడ్‌ కార్పొరేషన్‌(UCC) నుంచి ఈ పరిహారం రాబట్టే ఉద్దేశంతో కేంద్రం ఈ పిటిషన్ వేసింది. మూడువేలకుపైగా మరణాలు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగించిన ఈ ఘటనలో అదనంగా రూ.7,844 కోట్ల మేర పరిహారాన్ని కోరింది. గతంలో జరిగిన సెటిల్‌మెంట్ సమయంలో ప్రమాద తీవ్రతను సరిగా అంచనా వేయలేదని వాదించింది. అయితే విష వాయువు బాధితులకు రూ.715 కోట్ల పరిహారం చెల్లింపుపై తీర్పు వెలువడి చాలా ఏళ్లు గడిచిన తర్వాత దాఖలైన పిటిషన్‌కున్న విచారణార్హతను ప్రతివాదులు ప్రశ్నిస్తున్నారంటూ గతంలోనే కోర్టు వ్యాఖ్యానించింది.

తాజాగా ఈ పిటిషన్‌ హేతుబద్ధతను కోర్టు ప్రశ్నించింది. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి సరైన కారణం చూపనందువల్ల కేంద్ర ప్రభుత్వ వాదనతో మేం సంతృప్తి చెందలేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మోసం జరిగినట్లు తేలితే ఆ సెటిల్‌మెంట్‌ను పక్కనపెట్టవచ్చని, అయితే ఇక్కడ ప్రభుత్వం అలాంటి వాదనేమీ చేయలేదని పేర్కొంది. ఆ సెటిల్‌మెంట్‌ వేళ ఆ మొత్తం సరిపోదని ప్రభుత్వం అనలేదని గత విచారణలో భాగంగా యూసీసీ అనుబంధ సంస్థలు వెల్లడిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని