Gujarat riots: మోదీకి క్లీన్‌ చిట్‌ను సవాల్‌ చేసిన పిటిషన్‌ కొట్టివేత

2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సహా 62 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది....

Published : 24 Jun 2022 12:15 IST

సుప్రీంకోర్టులోనూ జకియా జఫ్రీకి చుక్కెదురు

దిల్లీ: 2002 గుజరాత్‌ అల్లర్ల (Gujarat riots) కేసులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ (Modi) సహా 62 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) శుక్రవారం కొట్టివేసింది. కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ భార్య జకియా జఫ్రీ (Zakia Jafri) సిట్‌ దర్యాప్తును సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిట్‌ నివేదికను సమర్థిస్తూ గతంలో ప్రత్యేక మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ జారీ చేసిన ఆదేశాలతో తాజాగా జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.

2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్‌ తేల్చింది. సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ జకియా పలుకోర్టులను ఆశ్రయించారు.

మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని సిట్‌ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్‌ తప్పించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్‌ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు సైతం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని