Supreme Court: దిల్లీ హత్యాచార కేసు.. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’తోనే వారిని నిర్దోషులుగా..
సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా తేల్చింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కింది కోర్టుల్లో ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు జరిగినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
దిల్లీ: సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చుతూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం విమర్శలకు దారితీసింది. 2012లో దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఓ 19ఏళ్ల యువతి సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను దోషులుగా తేల్చుతూ దిల్లీ హైకోర్టు మరణశిక్ష విధించగా.. సుప్రీంకోర్టు సోమవారం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అందుకే ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేసింది.
‘‘ఈ కేసులో నిందితులపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. కేవలం సహేతుకమైన సందేహాలు మినహా ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయింది. అందుకే అత్యంత క్రూరమైన నేరంలో నిందితులుగా ఉన్నప్పటికీ.. వారిని నిర్దోషులుగా ప్రకటించడం తప్ప కోర్టుకు మరో అవకాశం లేకుండా పోయింది. నైతిక నేరారోపణ ఆధారంగా లేదా అనుమానంతో మాత్రమే నిందితులను శిక్షించడానికి చట్టం అంగీకరించదు. ఏ కేసులోనైనా సరే న్యాయస్థానాలు చట్టానికి లోబడే తీర్పులు ఇవ్వాలి. అంతేగానీ.. నైతికపరమైన బయటి ఒత్తిళ్లు.. ఇతరత్రా అంశాలు తీర్పును ప్రభావితం చేయకూడదు’’ అని కోర్టు వివరించింది.
ఈ కేసు విచారణ సమయంలో లోపాలు జరిగినట్లు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తించింది. ఈ కేసులో 49 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారించగా.. ఇందులో 10 మందిని డిఫెన్స్ కౌన్సిల్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదని కోర్టు పేర్కొంది. అంతేగాక, దర్యాప్తు సమయంలో ఒక్క సాక్షి కూడా నిందితులను గుర్తించలేదని తెలిపింది. ఇక, మృతదేహం వద్ద లభించిన సాక్ష్యాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. అత్యాచారం, హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ఓ పొలంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు చెబుతున్నారని, అప్పటివరకు ఎవరూ మృతదేహాన్ని చూడకపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు కొన్ని కీలక అంశాలను విస్మరించి తీర్పు వెలువరించిందని, దాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేసింది.
ఉత్తరాఖండ్కు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్లోని సైబర్సిటీలో పనిచేస్తూ దిల్లీలో నివాసం ఉండేది. 2012 ఫిబ్రవరిలో కార్యాలయం నుంచి వస్తుండగా ఇంటికి సమీపంలోనే అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు. ముగ్గురు వ్యక్తులు ఆమెను కారులో తీసుకుపోయి, సామూహిక అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా గాజు సీసాలతో, లోహపు వస్తువులతో చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు దానిలో వెల్లడైంది. ఈ కేసులో దిగువ న్యాయస్థానం ఆ ముగ్గురినీ దోషులుగా తేల్చి, మరణ శిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లినప్పుడు ఈ హత్యాచార ఘటనను ‘అత్యంత దారుణమైనది’గా అభివర్ణించిన హైకోర్టు.. నిందితులకు ఈ శిక్ష ఖరారు చేస్తూ 2014లో తీర్పు వెలువరించింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: అషు కారు ప్రయాణం.. నిఖిత ‘రెడ్’ హొయలు
-
India News
Viral video: మహిళను కారులోకి లాక్కెళ్లి.. కొట్టడంపై DCW సీరియస్!
-
Sports News
Steve Smith: సూపర్ మ్యాన్లా స్మిత్.. క్యాచ్ ఆఫ్ ది సెంచరీ చూస్తారా?
-
Politics News
Komatireddy: రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేస్తా: ఎంపీ కోమటిరెడ్డి
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
World News
Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్.. నిక్నేమ్ కూడా పెట్టారట..!