Maharashtra: ‘మహా’ సంక్షోభం.. శిందే వర్గానికి సుప్రీం ఊరట..!

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కన్పించట్లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ ఏక్‌నాథ్‌ శిందే వర్గం

Published : 27 Jun 2022 16:06 IST

అనర్హత నోటీసులపై సమాధానమిచ్చేందుకు గడువు

రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై ఠాక్రే సర్కారుకు నోటీసులు

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కన్పించట్లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ ఏక్‌నాథ్‌ శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ మహారాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు అనర్హత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు శిందే వర్గానికి జులై 11 వరకు గడువు కల్పిస్తూ విచారణను వాయిదా వేసింది. అప్పటిదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది.

ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ శిందేపై శివసేన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను పార్టీ శాసనసభాపక్ష నేత హోదా నుంచి తొలగించింది. ఆ స్థానంలో అజయ్‌ ఛౌదరిని నియమించింది. ఈ నియామకాన్ని డిప్యూటీ స్పీకర్‌ ఆమోదించారు. మరోవైపు, శిందే సహా 16 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ అనర్హత నోటీసులు జారీ చేసింది. దీనిపై జూన్‌ 27వ తేదీ సాయంత్రంలోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై శిందే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్‌పై తాము తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నందున.. ఆయన అనర్హత నోటీసులు ఇవ్వడం చట్టబద్ధం కాదని పిటిషన్‌లో పేర్కొంది. అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరింది. అంతేగాక, కేవలం 15 మంది మద్దతున్న వ్యక్తి  శివసేన శాసనసభా పక్షనేత కాలేరని, అందువల్ల అజయ్‌ ఛౌదరి నియామకం చెల్లదని పేర్కొంటూ శిందే వర్గం పిటిషన్‌ దాఖలు చేసింది.

బాంబే హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు..

ఈ పిటిషన్లపై జస్టిస్​సూర్యకాంత్​, జస్టిస్​జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ సోమవారం విచారణ చేపట్టింది. అనర్హత నోటీసులపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముందు బాంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని కోర్టు ప్రశ్నించింది. అక్కడ తమకు ప్రాణహాని ఉందని రెబల్‌ ఎమ్మెల్యేలు తెలిపారు. అందుకే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.

బలపరీక్షపై ఉత్తర్వులు ఇవ్వలేం..

వాదోపవాదాల అనంతరం శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని డిప్యూటీ స్పీకర్‌, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై ఐదు రోజుల్లోగా తమ స్పందన తెలియజేయాలని సూచించింది. అటు శివసేన శాసనసభాపక్ష నేతగా నియమితులైన అజయ్‌ ఛౌదరికీ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అఫిడవిట్‌ రికార్డులను సమర్పించాలని డిప్యూటీ స్పీకర్‌ను సూచించింది.

ఈ సందర్భంగా రెబల్‌ ఎమ్మెల్యేలకు కోర్టు కాస్త ఊరట కల్పించింది. డిప్యూటీ స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసులపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు జులై 11వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు గడువు కల్పించింది. అనంతరం ఈ కేసును జులై 11వ తేదీని వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే, అప్పటిదాకా రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కాగా, శివసేనపై తిరుగుబాటు చేసిన 39 మంది ఎమ్మెల్యేల ప్రాణాలు, ఆస్తులను రక్షణ కల్పించాలని మహా సర్కారును ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని