Supreme Court: సోషల్‌ మీడియాపై నియంత్రణ ఉండాల్సిందే : సుప్రీంకోర్టు న్యాయమూర్తి

దేశంలో న్యాయమూర్తులు, వారి తీర్పులను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత దాడులకు ప్రయత్నించడం ప్రమాదకరమైన పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పర్దీవాలా ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 03 Jul 2022 21:39 IST

జడ్జీలపై వ్యక్తిగత దాడులు ప్రమాదకరమన్న జస్టిస్‌ జేబీ పర్దీవాలా

దిల్లీ: దేశంలో న్యాయమూర్తులు, వారి తీర్పులను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత దాడులకు ప్రయత్నించడం ప్రమాదకరమైన పరిణామమని సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పర్దీవాలా ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రక్షించుకోవాలంటే డిజిటల్‌, సోషల్‌ మీడియా (Social Media)లను తప్పనిసరిగా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేదికలపై లక్ష్మణరేఖ దాటుతూ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగతంగా, దురుద్దేశంతో దాడులకు పాల్పడడం ప్రమాదకరమన్నారు. మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలన్న సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పర్దీవాలా.. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘న్యాయమూర్తులు, వారి తీర్పులకు వ్యతిరేకంగా దాడులకు ప్రయత్నించడం ప్రమాదకర పరిణామం. చట్టప్రకారం ఏం తీర్పు ఇవ్వాలో అనే విషయం కంటే మీడియా ఏ కోణంలో చూస్తుందనే విషయంపైనే న్యాయమూర్తులు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావడం దురదృష్టకరం’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పర్దీవాలా పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ ప్రభావం ప్రతిబింబించేలా తీర్పు ఉండకూదని.. కచ్చితంగా అది చట్టప్రకారమే ఉండాలని ఉద్ఘాటించారు. ఇక డిజిటల్‌, సోషల్‌ మీడియాలపై మాట్లాడిన ఆయన..  ఇవి కేవలం సగం వాస్తవాలను మాత్రమే కలిగి ఉండి, న్యాయప్రక్రియలో పరిశోధనలు మొదలు పెడతాయని అన్నారు. ఇటువంటి నేపథ్యంలో న్యాయమూర్తులు కేవలం తీర్పుల ద్వారానే మాట్లాడాలని.. సోషల్‌ మీడియా వేదికల్లో మాట్లాడకూడదని జడ్జీలకు సూచించారు.

ఇదిలాఉంటే, మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండైన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో మీడియా వేదికగా దేశ ప్రజలకు నుపుర్‌ శర్మ క్షమాపణ చెప్పాలని సుప్రీం న్యాయమూర్తి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని