SC: రద్దయిన చట్టం కింద కేసులు.. రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

రద్దైన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదుకావడంపై సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అన్ని హైకోర్టుల్లోని రిజిస్ట్రార్‌ జనరల్‌ను కూడా ఆ నోటీసుల్లో భాగం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

Published : 02 Aug 2021 14:51 IST

దిల్లీ: రద్దయిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు కావడంపై సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అన్ని హైకోర్టుల్లోని రిజిస్ట్రార్‌ జనరల్‌ను కూడా ఆ నోటీసుల్లో భాగం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ‘న్యాయపరంగా ఈ అంశాన్ని విడిగా పరిశీలిస్తాం. అలాగే ఇది పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇస్తున్నాం’ అంటూ సుప్రీం వెల్లడించింది.

ఓ కేసు విచారణ సందర్భంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లోనే సుప్రీం తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని 2019లోనే ఆదేశాలు జారీచేసింది. అయినా, పలు చోట్ల  పోలీసులు సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. విచారణలో భాగంగా ఇది చాలా దారుణమైన పరిణామమని వ్యాఖ్యానిస్తూ.. సుప్రీం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ రద్దయిన చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని అన్ని రాష్ట్రాలకు ఇటీవలే కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని