Supreme Court: రద్దైన నోట్లపై కేంద్రాన్ని సంప్రదించండి.. పిటిషనర్లకు సుప్రీం సూచన

రద్దైన నోట్లను (Demonetised Notes) అంగీకరించాలని కోరుతూ దాఖలైన వ్యక్తిగత పిటిషన్లను పరిగణనలోనికి తీసుకునేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. వీటికి సంబంధించి ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిందని.. ఏమైనా అభ్యర్థనలు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్లకు సూచించింది.

Published : 21 Mar 2023 22:41 IST

దిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ (Demonetisation) 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇదివరకే తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రద్దైన రూ.1000, రూ.500 పాతనోట్లను అంగీకరించాలని కోరుతూ దాఖలైన వ్యక్తిగత పిటిషన్లను పరిగణనలోనికి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించేందుకు పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది. రద్దైన నోట్లను అంగీకరించాలని వచ్చే అభ్యర్థనలపై నిర్ణయం తీసుకోవాలని.. వ్యక్తిగత ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని 12వారాల్లోనే వాటిని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

‘రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత రద్దైన కరెన్సీ నోట్లను అంగీకరించాలని దాఖలవుతున్న వ్యక్తిగత కేసులను విచారించడమనేది మా అధికార పరిధిలో లేని అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారం అది ఆమోద యోగ్యం కాదు’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై ఎవరైనా ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందకపోతే.. అటువంటి వారు ఆయా హైకోర్టులను ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని స్పష్టతనిచ్చింది.

నవంబర్‌ 8, 2016న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. నోట్ల రద్దు నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నారని  పేర్కొంటూ ఈ ఏడాది జనవరిలో తీర్పు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని