Supreme Court: కూల్చివేతలపై స్టే ఇవ్వలేం.. అలాచేస్తే అధికారుల హక్కులను హరించడమే..!

అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఒకవేళ అలా చేస్తే మున్సిపల్‌ అధికారుల హక్కులను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది.

Published : 14 Jul 2022 01:31 IST

అక్రమ కట్టడాల తొలగింపునపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే (Demolition) ప్రక్రియ పలు రాష్ట్రాల్లో ఇటీవల ముమ్మరంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) తిరస్కరించింది. ఒకవేళ అలా చేస్తే మున్సిపల్‌ అధికారుల హక్కులను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని యూపీ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా స్పందించింది. యూపీతోపాటు ఇదే ప్రక్రియను అనుసరిస్తోన్న మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల స్పందనను తెలియజేయాలని నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను యోగీ ప్రభుత్వం చేపట్టింది. వీటిని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలామా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడుతోందంటూ పిటిషనర్‌ తరపున న్యాయవాదులు దుష్యంత్‌ దవే, సీయూ సింగ్‌లు వాదించారు. మతపరమైన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఈ తరహా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని.. మన సమాజానికీ మంచిది కాదని పేర్కొన్నారు. ప్రతివాదుల తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేలు.. అలాంటిదేమీ లేదని, ముఖ్యంగా అల్లర్లకు-కూల్చివేతలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాధారణంగా జరిగే ప్రక్రియేనని, చట్టప్రకారమే వీటిని కొనసాగిస్తున్నామని యూపీ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై రాష్ట్రాలకు మధ్యంతర స్టేను ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, జమియత్ ఉలామా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 10న మరోసారి విచారణ జరుపుతామని పేర్కొంది.

ఇదిలాఉంటే, భాజపా మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారితీశాయి. వాటిపై చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు.. హింసాత్మక ఘటనలో నిందితులుగా ఉన్నవారి నివాసాలను కూల్చివేసే ప్రక్రియను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గత నెల విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ ప్రక్రియ ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని.. అవి చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని వ్యాఖ్యానించింది. కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని