
Supreme Court: రూ.4లక్షల పరిహారంపై తీర్పు రిజర్వ్
మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరును సులభతరం చేయాలన్న సుప్రీం
దిల్లీ: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై నేడు రెండు గంటలపాటు విచారణ చేపట్టింది. మూడు రోజుల్లోగా ఇరు పార్టీల వాదనలను లిఖితపూర్వకంగా నివేదించాలని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం, కొవిడ్తో మరణించిన వారి మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరును సులభతరం చేయాలని కేంద్రానికి సూచించింది.
అంతకుముందు పిటిషన్ విచారణ సందర్భంగా.. ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం కింద కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు 183 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. ప్రభుత్వాల ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయని, ఒకవేళ ఇలా మృతుల కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించాలంటే రాష్ట్రాల ప్రకృతి వైపరీత్య నిధులు పూర్తిగా దానికే కేటాయించాల్సి వస్తుందని పేర్కొంది. అంతిమంగా మంచి కన్నా చెడే జరుగుతుందని తెలిపింది. జాతీయ ప్రకృతి వైపరీత్య చట్టం కింద 2015 ఏప్రిల్ 8న కేంద్ర హోం శాఖ జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి ప్రతి బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ గౌరవ్కుమార్ బన్సల్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ కరోనా మరణాల సంఖ్య కొనసాగుతూనే ఉంది. నిత్యం 1500లకు పైగా కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 1,422 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారిసంఖ్య 3లక్షల 88వేలు దాటింది.