Lakhimpur Kheri: లఖింపుర్‌ ఖేరి హింసాకాండపై రేపు సుప్రీం విచారణ

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఈ నెల 3వ తేదీని చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ జరపనుంది.  ఈ ఘటనపై

Published : 19 Oct 2021 13:57 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఈ నెల 3వ తేదీని చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ జరపనుంది. 
 ఈ ఘటనపై దసరా పండగ ముందు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

లఖింపుర్‌ ఖేరి ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ నెల 8వ తేదీని విచారణ జరిపింది.

ఆ సందర్భంగా లఖింపుర్‌ హింసకు కారణమైన నిందితుల పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘దయచేసి విచారణకు హాజరుకండి’ అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మండిపడింది. మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీసింది. యూపీ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవని దుయ్యబట్టింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటనపై మరో ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలా లేదా అన్నదానిపై రేపటి విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని