BrahMos: సీ టు సీ వేరియంట్‌ ‘బ్రహ్మోస్‌’ ప్రయోగంవిజయవంతం

నేవీకి చెందిన ఓ యుద్ధనౌక(స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌) నుంచి మంగళవారం చేపట్టిన అధునాతన సీ టు సీ వేరియంట్‌ బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఈ మేరకు డీఆర్‌డీఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్షిపణి నిర్దేశిత...

Published : 11 Jan 2022 23:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత నేవీకి చెందిన ఓ యుద్ధనౌక(స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌) నుంచి మంగళవారం చేపట్టిన అధునాతన సీ టు సీ వేరియంట్‌ బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమయింది. ఈ మేరకు డీఆర్‌డీఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు తెలిపింది. ‘సముద్రం నుంచి సముద్రంలోకి ప్రయోగించగల అడ్వాన్స్‌డ్‌ సీ టు సీ వేరియంట్‌ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని నేడు ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ నుంచి విజయవంతంగా పరీక్షించాం. ఈ క్షిపణి నిర్దేశిత టార్గెట్‌గా ఉన్న ఓ నౌకను కచ్చితత్వంతో ఛేదించింది’ అని డీఆర్‌డీఓ ట్వీట్ చేసింది.

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సిబ్బందికి అభినందనలు తెలిపారు. దేశ నావికాదళం సంసిద్ధత సామర్థ్యాన్ని ఇది మరోసారి నిరూపిస్తోందని ట్వీట్‌ చేశారు. భారత్‌, రష్యాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ ద్వారా ఈ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ధ్వని కంటే దాదాపు మూడు రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలవు. తాము తయారు చేస్తోన్న బ్రహ్మోస్‌తోపాటు ఇతర అధునాతన రక్షణ ఆయుధాలు ఇతర దేశాలపై దాడి చేసేందుకు కాదని, ఆ దేశాలు భారత్‌పై కన్నెత్తే సాహసం చేయకుండా ఉండేందుకేనని రాజ్‌నాథ్‌ ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని