బెంగాల్‌, అసోంలో కొనసాగుతోన్న రెండో దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో గురువారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో దశలో భాగంగా బెంగాల్‌లో 30 స్థానాలకు, అసోంలో 39 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది.

Updated : 01 Apr 2021 09:12 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో గురువారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. బెంగాల్‌లో 30 స్థానాలకు, అసోంలో 39 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

నందిగ్రామ్‌లో సంగ్రామం ప్రారంభం
బెంగాల్‌లో రెండో దశలో భాగంగా 30 స్థానాల్లో మొత్తం 171 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మొత్తం 30 స్థానాల పరిధిలో 75.94లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న బెంగాల్‌లోని నందిగ్రామ్‌ నియోజకవర్గంలో పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార టీఎంసీ నుంచి సీఎం మమతా బెనర్జీ, భాజపా తరపున సువెందు అధికారి వంటి సీనియర్‌ నేతలు పోటీలో ఉండటంతో ఆ స్థానం ఎన్నిక రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇప్పటికే 144 సెక్షన్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నుంచే నందిగ్రామ్‌లోకి బయటి వ్యక్తుల అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులతో పటిష్ఠ పహారా నిర్వహిస్తున్నారు. 

అసోంలో 345 మంది బరిలో
అసోంలో రెండో దశలో భాగంగా 39 స్థానాల పరిధిలో 345 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా అసోంలో మొత్తం 39 స్థానాల పరిధిలో 73.44లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్దకు బారులు తీరారు. 

ఓటర్లకు మోదీ విజ్ఞప్తి
బెంగాల్‌, అసోం రాష్ట్రాల అసెంబ్లీకి రెండో దశ ఎన్నికల సందర్భంగా ప్రజలు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘బెంగాల్‌, అసోంలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ప్రజలు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని