అంబానీ ఇంటివద్ద పేలలేదు.. అక్కడ పేలింది

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కేసు అనేక మలుపులు తీసుకుంటుంది.

Updated : 19 Mar 2021 13:22 IST

విమర్శలు గుప్పించిన సామ్నా సంపాదకీయం

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. అలాగే ముంబయి పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌పై వేటు పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో భాజపా వైఖరిని, ఎన్‌ఐఏ దర్యాప్తు తీరును ప్రశ్నించింది.

‘కార్మిచెల్ రోడ్డు సమీపంలో గుర్తించిన 20 జిలిటెన్‌ స్టిక్స్ పేలలేదు. కానీ ఈ పేలుడు పదార్థాలు రాజకీయంగా, అధికార యంత్రాంగంలో తీవ్రస్థాయిలో పేలుళ్లకు కారణమవుతున్నాయి. దీని వల్లే ముంబయి పోలీసు తన పదవి నుంచి బదిలీ కావాల్సి వచ్చింది’ అంటూ సామ్నా విమర్శనాత్మకంగా రాసుకొచ్చింది. ఈ కేసును ముంబయి పోలీసు విభాగానికి చెందిన ఉగ్రవాద నిరోధక బృందం దర్యాప్తు చేస్తోంది. అకస్మాత్తుగా ఎన్ఐఏ ఎందుకు ఈ కేసు దర్యాప్తును చేపట్టిందంటూ అనుమానం వ్యక్తం చేసింది.

‘దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం త్వరలోనే బయటకు వస్తుంది. ఈ కేసుకు ఉగ్రవాదంతో సంబంధం లేకున్నా..ఎన్‌ఐఏ ఎందుకు ఇంతగా ప్రత్యేక దృష్టి సారించింది. అసలు ఏం జరుగుతోంది? ఉరి, పఠాన్‌కోట్‌, పుల్వామా దాడుల సమయంలో గుర్తించిన జిలిటెన్‌ స్టిక్స్‌పై ఎన్‌ఐఏ జరిపిన దర్యాప్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ దర్యాప్తులో ఏ నిజాన్ని బయటపెట్టారు? ఎంతమందిని అరెస్టు చేశారు. అది ఇప్పటికీ సస్పెన్సే’ అని శివసేన మండిపడింది. పరంబీర్‌పై వేటు వేశారంటే ఆయన తప్పుచేసినట్లు కాదని మద్దతు ప్రకటించింది.

అయితే ఈ విమర్శలను భాజపా తోపిపుచ్చింది. ‘శివసేన వాజే గ్యాంగ్‌కు మద్దతు ఇస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసిన పోలీసు అధికారిపై ప్రశంసలు కురిపిస్తోంది. ఆ రాష్ట్ర హోం మంత్రి ఒకటి చెప్తే, శివసేన ఇంకోటి చెప్తోంది. వారి మధ్య ఉన్న విభేదాలు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రభావం చూపుతున్నాయి’ అని భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆ రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్‌ భాగంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని