Noida Twin Towers: ఆ నలుగురి పోరాట ఫలితం.. 40అంతస్తుల టవర్ల కూల్చివేతకు ఆదేశం..!

నలుగురు వృద్ధులు దశాబ్దానికి పైగా చేసిన పోరాటానికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో విజయం దక్కింది. ఇందుకోసం వారు ఎన్నోసార్లు కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణించారు.

Published : 01 Sep 2021 16:51 IST

నోయిడా: నలుగురు వృద్ధులు దశాబ్దానికి పైగా చేసిన పోరాటానికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో విజయం దక్కింది. ఇందుకోసం వారు ఎన్నోసార్లు కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణించారు. విరాళాలు పోగుచేసుకుని కోర్టుల చుట్టూ తిరిగారు. వారి 12ఏళ్ల అవిశ్రాంత న్యాయపోరాటానికి ఫలితం లభించింది. నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆ సీనియర్‌ సిటిజన్లకు నోయిడా వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో గల సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్ముక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు యూబీఎస్‌ టియోటియా(80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌(65), ఎంకే జైన్‌(59).. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు.

తొలుత వీరు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ టవర్లను వెంటనే కూల్చివేయాలని 2014 ఏప్రిల్‌లో హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సూపర్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, స్టేటస్‌కో విధించారు. దాదాపు ఏడేళ్ల విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. నిన్న సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ ట్విన్‌ టవర్లను మూడు నెలల్లో సొంత ఖర్చులతో కూల్చేయాలని బిల్డర్‌ను ఆదేశించింది. 

అయితే ఈ 12ఏళ్ల పోరాటం తమకు ఓ కఠిన ప్రయాణమని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు కమిటీలో ఒకరైన ఎస్‌కే శర్మ. ఒక్క సుప్రీంకోర్టులోనే ఏడేళ్లపాటు 30 సార్లు విచారణ జరిగిందన్నారు. దానికి ముందు అలహాబాద్‌ హైకోర్టుకు అనేకసార్లు వెళ్లామని అప్పుడు రైళ్లలో థర్డ్‌ క్లాస్‌లో ప్రయాణించామని చెప్పారు. ఇక సాక్ష్యాల కోసం స్థానిక, రాష్ట్ర సంస్థల నుంచి డాక్యుమెంట్లు సేకరించడం కూడా చాలా కష్టమైందని చెప్పుకొచ్చారు. ఈ న్యాయపోరాటం కోసం దాదాపు రూ.కోటికి పైనే ఖర్చయిందట. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి సొసైటీ సభ్యుల నుంచి విరాళాలు సేకరించామని టియోటియా చెప్పారు. న్యాయం తమవైపు ఉందని, కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతోనే పోరాటం చేశామని తెలిపారు. దీనికి నేడు ఫలితం దక్కిందన్నారు. 

టియోటియా సీఆర్పీఎఫ్‌లో డీఐజీగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఈయన నేతృత్వంలోనే ఈ న్యాయపోరాటం సాగింది. ఎస్‌కే శర్మ టెలికాం విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన ఎంకే జైన్‌ ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్‌తో మరణించారు. జైన్‌ చాలా ధైర్యవంతుడని, ఆయన బతికుంటే కోర్టు తీర్పుతో ఎంతో సంతోషపడేవారని ఆయన సతీమణి భావోద్వేగం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని