Noida twin towers: ఆ నలుగురి పోరాటం ఫలించిన వేళ.. ఎట్టకేలకు నోయిడా ట్విన్‌ టవర్స్‌ నేలమట్టం!

దేశంలో అక్రమ కట్టడాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక..! నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ను అధికారులు......

Updated : 28 Aug 2022 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో అక్రమ కట్టడాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక..! నోయిడాలో నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ను అధికారులు ఎట్టకేలకు కూల్చేశారు. దేశంలో తొలిసారి అత్యంత అధునాతన టెక్నాలజీని వినియోగించి ఎడిఫిస్‌ సంస్థ ఈ జంట భవనాలను పేల్చేసింది. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్‌జోన్‌లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్‌ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో నోయిడా అథారిటీ అధికారులు ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు నేలమట్టం చేశారు. అయితే, దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ నివాస భవంతుల కూల్చివేత అంత సులువుగా ఏమీ జరగలేదు. అంతపెద్ద నిర్మాణ సంస్థ సూపర్‌టెక్‌తో కోర్టుల్లో కొట్లాడటం వెనక పర్యావరణవేత్తలతో పాటు నలుగురు వ్యక్తుల  సుదీర్ఘ న్యాయ పోరాటం ఉంది.

పోరాటం అలా మొదలైంది..

ఈ అక్రమ కట్టడాల్ని కూల్చివేసేందుకు నలుగురు సీనియర్‌ సిటిజన్లు అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులలో దాదాపు దశాబ్ద కాలం పాటు అలుపెరుగని పోరాటం చేశారు.  సూపర్‌ టెక్‌ నిర్మాణ సంస్థతో కొట్లాడేందుకు తమ స్థోమత సరిపోక విరాళాలు పోగుచేసుకుని మరీ కోర్టుల చుట్టూ తిరిగారు. వారి 12ఏళ్ల అవిశ్రాంత న్యాయ పోరాటానికి ఫలితమే ఈ రోజు. ఆ టవర్స్‌ కూల్చివేత. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో గల సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డర్‌ పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనల్ని గాలికొదిలేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు యూబీఎస్‌ టియోటియా (80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌(65), ఎంకే జైన్‌(59).. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌ సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లారు. 

తొలుత వీరు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ టవర్లను వెంటనే కూల్చివేయాలని 2014 ఏప్రిల్‌లో హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సూపర్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్‌కో విధించారు. దాదాపు ఏడేళ్ల విచారణ అనంతరం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తుది తీర్పు వెలువరించింది. ఆ ట్విన్‌ టవర్లను బిల్డర్‌ సొంత ఖర్చులతోనే కూల్చేయాలని ఆదేశించింది.  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత కూడా ఈ కూల్చివేతకు చాలా సమయం తీసుకున్నారు. ఇప్పటివరకు నాలుగుగైదు సార్లు కూల్చివేతకు సంబంధించి షెడ్యూల్‌ తయారు చేసినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, చివరకు ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు భారీగా పేలుడు పదార్థాలను వినియోగించి ఆ భవంతులను నేలమట్టం చేశారు. 

అయితే గతేడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంలో తమకు ఈ 12ఏళ్ల పోరాటం ఓ కఠిన ప్రయాణమని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు కమిటీలో ఒకరైన ఎస్‌కే శర్మ. ఒక్క సుప్రీంకోర్టులోనే ఏడేళ్లపాటు 30 సార్లు విచారణ జరిగిందన్నారు. దానికి ముందు అలహాబాద్‌ హైకోర్టుకు అనేకసార్లు వెళ్లామని అప్పుడు రైళ్లలో థర్డ్‌ క్లాస్‌లో ప్రయాణించామని చెప్పారు. ఇక సాక్ష్యాల కోసం స్థానిక, రాష్ట్ర సంస్థల నుంచి డాక్యుమెంట్లు సేకరించడం కూడా చాలా కష్టమైందని చెప్పుకొచ్చారు. ఈ న్యాయపోరాటం కోసం దాదాపు రూ.కోటికి పైనే ఖర్చయిందట. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి సొసైటీ సభ్యుల నుంచి విరాళాలు సేకరించామని టియోటియా చెప్పారు. న్యాయం తమవైపు ఉందని, కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతోనే పోరాటం చేశామన్నారు.

టియోటియా సీఆర్పీఎఫ్‌లో డీఐజీగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఈయన నేతృత్వంలోనే ఈ న్యాయపోరాటం సాగింది. ఎస్‌కే శర్మ టెలికాం విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన ఎంకే జైన్‌ ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్‌తో మరణించారు. జైన్‌ చాలా ధైర్యవంతుడని, ఆయన బతికుంటే కోర్టు తీర్పుతో ఎంతో సంతోషపడేవారని ఆయన సతీమణి గతంలో సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా భావోద్వేగం వ్యక్తంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని