మాస్క్‌, భౌతిక దూరం: ఇవే ఆయుధాలు

కరోనా రెండో దశపై సరైన అంచనాలు లేకపోవటంతోనే వైరస్ విరుచుకుపడుతోందని సీనియర్ వైద్యులు రామచందర్ రావు పేర్కొన్నారు.

Published : 30 Apr 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రెండో దశపై సరైన అంచనాలు లేకపోవటంతోనే వైరస్ విరుచుకుపడుతోందని సీనియర్ వైద్యులు రామచందర్ రావు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ కాగానే ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇంటి వద్ద చికిత్సతోనే కోలుకోవచ్చని అన్నారు. పరిస్థితి తీవ్రంగా మారితే వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. మాస్క్ పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం కరోనాను ఎదిరించే ఆయుధాలని ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

కరోనా మొదటి ఉద్ధృతి కన్నా రెండో ఉద్ధృతి తీవ్రంగా ఉండటానికి కారణాలు ఏమై ఉండొచ్చు?

కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచంలో ఎక్కడా నమోదు కానటువంటి సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  కరోనా మొదటి దశలో కేంద్రం అప్రమత్తంగా ఉంది. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధలను పాటించి కరోనా వ్యాప్తిని నిలువరించారు. కరోనా వ్యాప్తి తగ్గాక తగిన జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. దాంతో కరోనా ఉద్ధృతి పెరిగింది. ఇంగ్లాండ్‌లో వైరల్‌ మ్యుటేషన్‌ కారణంగా కరోనా మళ్లీ విజృంభించింది. మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించి, అప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే కరోనా ఇంత విధ్వంసం సృష్టించి ఉండేది కాదు.

హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్ల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా సోకిన వాళ్లకు లక్షణాలు అందరికీ ఒకే విధంగా ఉండటం లేదు. కొంతమందికి ఏ లక్షణాలు కనబడకున్నా పాజిటివ్‌ వస్తుంది. కరోనా సోకిన వాళ్లకు వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నవాళ్లకు అన్ని పరీక్షలు చేసి హోం ఐసోలేషన్‌లో ఉండమని చెబుతున్నాం. ఆక్సిజన్‌ లెవెల్స్‌ 93 శాతం కన్నా తగ్గితే ఆస్పత్రిలో జాయిన్‌ అవ్వమని సూచిస్తున్నాం. అయితే హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు గదిలోకి గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగతమైన మరుగుదొడ్లను వాడాలి. చిన్న ఇళ్లలో ఉండే వాళ్లకు హోం ఐసోలేషన్‌ కుదరదు కాబట్టి ప్రభుత్వం కేటాయించిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స తీసుకోవాలి.

కరోనా వైరస్‌ శ్వాసకోశాల మీదే ఎందుకు అధిక ప్రభావం చూపుతోంది?

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. దీన్ని వైరల్‌ న్యుమోనియా అని పిలుస్తారు. దీనివల్ల కరోనా పేషెంట్ల శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్లను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌ పెట్టుకోవాలి. చేతులు శుభ్రంగా కడుగుకోవాలి. తరచుగా చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి. సరైన వేళకు భోజనం తినాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొంత కాలం వివాహాది శుభకార్యాల్లో పాల్గొనకపోవడం మంచిది. ప్రస్తుతానికి తీర్థయాత్రలను వాయిదా వేసుకోవాలి. అజాగ్రత్తగా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని